తమిళసినిమా: ఇటీవల టీఎన్ 2026 చిత్రం గురించి చాలా వివాదాస్పద చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. కారణం ఈ చిత్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించే సన్నివేశాలు చోటుచేసుకున్న అన్న ఆరోపణలే. ఇటీవల ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. అందులో హీరోగా నటించిన నట్టి గెటప్ విజయ్ను పోలి ఉంది. దీంతో టీవీకే పార్టీ చైన్నె విల్లివాక్కం నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అధవ్అర్జున్ టీఎన్–2026 చిత్రంపై విమర్శలు చేశారు. విజయ్ను పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడానికి ఈ చిత్రాన్ని ఎన్నికలకు కొద్ది వారాల ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అయితే ఈ చిత్రాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్నన్ గ్రూప్ పతాకంపై కన్నన్రవి, కందన్రవి, దీపక్ రవి నిర్మించిన చిత్రం టీఎన్ 2026. తంబిరామయ్య కథను సమకూర్చిన ఈ చిత్రానికి ఆయన వారసుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. నట్టి కథానాయకుడిగా నటించిన ఇందులో శ్రితరావు నాయకిగా నటించారు తంబిరామయ్య, ఎంఎస్ భాస్కర్, ఇళవరసు, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్, విజీ చంద్రశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. తర్బకా శివ సంగీతాన్ని, ముత్తయ్య చాయాగ్రహణం అందించారు. ఈనెల 10న తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ఏఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తంబిరామయ్య మాట్లాడుతూ టీఎన్ 2026 చిత్రం ఏ రాజకీయ పార్టీని విమర్శించే విధంగా ఉండదని పేర్కొన్నారు. అధవ్ అర్జున తమ చిత్రం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన చిత్రం చూడాలని అన్నారు. విజయ్ సింహం అని, ఆయన్ని ఎవరూ విమర్శించలేరని తంబిరామయ్య పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్ను ఢీ ఫేమ్ చేయలేదని నట్టి పేర్కొన్నారు.
ప్రతిభకు పురస్కారం
తమిళసినిమా: నారీమణులు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు ధీటుగా ప్రగతి పథంలో దూసుకు పోతున్నారు. అలా సినిమా, బుల్లితెర, మీడియా, ఇతర వ్యాపార రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ ఉన్నత స్థాయిలో రాణిస్తున్న మహిళామణి శ్రీమతి శశికళ నాగరాజన్. ఈమె అనేక రంగాల్లో దూరదృష్టి కలిగిన వ్యాపార వేత్తగా, శక్తివంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. వ్యాపారరంగంలో మాత్రమే కాకుండా మీడియా, ఎంటర్టెయిన్మెంట్ రంగాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కళైజ్ఞర్ టీవీ, ఇశైయరువి, కెప్టెన్ టీవీ, జీతమిళ్ వంటి టీవీ చానల్లో యాంకర్గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. అదేవిధంగా పేర్ సొల్లుంగ వరలారు, టిఫిన్ టైం, ఓంకారం, కొంచెం కాఫీ నెరియ సినిమా వంటి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా పాపులర్ అయ్యారు. పలు తమిళ సీరియళ్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. సన్ టీవీలో ప్రసారమైన కులదైవం, రన్, కల్యాణపరుసు, జీ తమిళ్ చానల్లో ప్రసారమైన యారడీ నీ మోహిని, హేండ్రేండ్రుమ్ పున్నగై వంటి సీరియల్లో నటించారు. అంతేకాకుండా 18 గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్థాపకురాలుగా పేరుగాంచిన ఈమె గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్లో చేసిన విశిష్టసేవలకుగాను గౌరవ డాక్టరేట్తో ఘనంగా సత్కరించారు. శశికళ నాగరాజన్ తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్లోబల్ వ్యాపారం, మీడియా రంగాల్లో తన సేవలను మరింత విస్తృతం చేస్తానని పేర్కొన్నారు.


