సాక్షి, చైన్నె: డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి,పార్లమెంటరీ నేత కనిమొళి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శివగంగ జిల్లా తిరుభువనం, మానామదురై నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణిస్వామిని టార్గెట్ చేసి సటైర్లు వేశారు. తమిళుల గుర్తింపును ప్రపంచానికి చాటిచెప్పిన నేల కీలడి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, తమిళ సంస్కృతి పురాతనమైనదని నిరూపించే ఆధారాలు ఇక్కడే ఉన్నాయని గుర్తుచేస్తూ, అందుకే ఇక్కడే తాను ప్రచారం మొదలెట్టినట్టు పేర్కొన్నారు.
కేంద్రం చెప్పినట్లు వింటూ..
సీఎం స్టాలిన్ కీలడి తవ్వకాలపై శాసీ్త్రయ నివేదికను కేంద్రానికి సమర్పించినా, బీజేపీ ప్రభుత్వం దానిని ఆమోదించడం లేదని ఆరోపించారు. హిందీని రుద్దాలని చూసే బీజేపీకి తమిళుల గొప్పతనం నచ్చడం లేదని విమర్శించారు. బిహార్లో నితీష్ కుమార్కు రాజ్యసభ సీటు ఇచ్చినట్లుగానే, పళనిస్వామికి కూడా బీజేపీ కచ్చితంగా గవర్నర్ పదవి ఇస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కేవలం ఏ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లాలో ఎంచుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. పళనిస్వామి తమిళుల ప్రయోజనాల కంటే కేంద్రం చెప్పినట్లు వినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.


