తిరువళ్లూరు: టౌన్ పోలీసుస్టేషన్కు సమీపంలోని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు పట్టణంలోని దేవదాయశాఖకు చెందిన కాళికాంబ అమ్మవారి ఆలయం ఉంది. పురాతన ఆలయానికి చెందిన నిత్యం వందలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో అర్చకుడు నారాయణన్ గురువారం రాత్రి పూజలు అనంతరం ఆలయానికి తాళం వేసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆలయానికి యథావిధిగా రాగా అప్పటికే ఆలయంలోని హుండీతో పాటు గర్బగుడి తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి. హుండలోని నగదు, అమ్మవారి నగలను ఎత్తుకెళ్లినట్టు గుర్తించి షాక్కు గురయ్యారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. టౌన్ పోలీసుస్టేషన్కు సమీపంలోని ఆలయంలో చోరీ జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
మళ్లీ వార్తల్లోకి అన్నావర్సిటీ
అన్నానగర్: 2024లో అన్నా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపు ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్కు 30 ఏళ్ల జైలు శిక్ష ఇటీవల విధించారు. ఈ ఘటన మరువక ముందే అన్నా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేదింపు ఘటన తాజాగా మరోసారి కలకలం రేపింది. ఈ విషయమై విద్యార్థిని దాఖలు చేసిన ఫిర్యాదులో ప్రొఫెసర్ లైంగిక దుష్ప్రవర్తన బయటపడింది. విద్యార్థిని దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు వివరాల మేరకు అన్నా వర్సిటీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న గత మూడేళ్లుగా తనను ప్రొఫెసర్ నిత్యం వేధిస్తూ వస్తున్నట్టు ఆరోపించారు. ఆయన వేదింపు పెరగడంతో కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. తనతో పాటుగా ఆయన వేధింపులకు మరెందరో గురై ఉన్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో వ్యవహారం దుమారానికి దారి తీసింది. పీఎంకే, బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.
నలుగురికి యావజ్జీవ శిక్ష
తిరువొత్తియూరు: చైన్నె, మదురవాయిల్లో ఇంజినీర్ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ పూందమల్లి కోర్టు తీర్పునిచ్చింది. చైన్నె మధురవాయల్ ప్రాంతానికి చెందిన ఢిల్లీబాబు అలియాస్ వెంకటేసన్ (29). ఇతను షిప్లో ఇంజినీర్గా పనిచేసేవారు. అదేప్రాంతానికి చెందిన గోకులకృష్ణన్ (38) ఢిల్లీబాబుతో నగదు విషయంగా శత్రుత్వం వుంది. దీంతో తన స్నేహితులైన కార్మేగం (38), భూపాలన్ (32), రాజ్కుమార్ ( 33), సుందరేసన్ (అలియాస్) సుందర్ (32), అందరూ కలిసి. గత 2012 ఫిబ్రవరి 6న ఢిల్లీబాబు (వెంకటేశ్)ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ కేసు విచారణ పూందమల్లి అదనపు కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. నేరం రుజువుకావడంతో కార్మేగం, భూపాలన్, రాజ్కుమార్, కందరేషన్ అనే నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి విజయకుమార్ తీర్పు వెలువరించారు. గోకుల్కృష్ణన్పై నేరం రుజువు కాకపోవడంతో అతన్ని విడుదల చేశారు.
ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్
అన్నానగర్: ఊటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గంజాయి వాడకం పెరుగుతోంది. విద్యార్థులు కూడా గంజాయి వాడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు మరింత నిఘాపెట్టారు. ఈ స్థితిలో గురువారం కళాశాల విద్యార్థులు కొందరు గంజాయి తీసుకుంటున్నారని తెలిసింది. పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం కళాశాల యాజమాన్యం ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది.


