పళ్లిపట్టు: శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి ఆలయాల్లో విశేష వేడుకలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో ప్రసిద్ధి చెందిన రామావతారాన్ని స్మరించుకునే విధంగా రామనవమి వేడుకలు కోలాహలంగా నిర్వహించడం పరిపాటి. పళ్లిపట్టులోని ఆంజనేయనగర్లో ప్రసిద్ది చెందిన కల్యాణ రామ సమేత వీరమంగళ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించి భక్తులు స్వామి దర్శనం చేశారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం పంపిణీ చేశారు. ఆర్కేపేట సమీపంలోని చెట్టివారిపల్లె గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 109వ వార్షికోత్సవ రామనవమి వేడుకలు సందర్భంగా వేకువజామున సీతారాములకు సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. స్వామికి పుష్పాలంకరణ చేపట్టి మహాదీపారాధన పూజలు నిర్వహించారు. గ్రామీణులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ సేవ సందర్భంగా విశేష అలంకరణలో స్వామివారు గ్రామ వీధుల్లో ఊరేగారు. ఇదే విధంగా పలు గ్రామాల్లో రాములవారి భజన మందిరాల్లో రామనవమి నిర్వహించి భజనలు చేపట్టారు.


