సాక్షి, చన్నై: తూత్తుకుడి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పరీక్ష రాసిన ఇంటికి వచ్చిన ప్లస్–2 విద్యార్థిని లైంగిక దాడికి గురై దారుణహత్యకు గురైంది. ఈ సమాచారం స్థానికంగా కలక లం రేపింది. బాలిక కనిపించడం లేదంటూ ఫిర్యా దు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విలాతికులం ఇన్స్పెక్టర్ ప్రవీణాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా విలాతి కుళం పరిధిలోని వేదనత్తం గ్రామానికి చెందిన సుబ్బరాయన్, కాళేశ్వరి దంపతుల రెండో కుమార్తె (17) స్థానిక క్రాస్రోడ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్లస్–2 చదువుతోంది. బుధవారం పబ్లిక్ పరీక్ష రాసి ఇంటికి వచ్చిన బాలిక కాసేపటికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
బాధిత కుటుంబం తొలుత కులత్తూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా, మైనర్ కావడంతో విలాతికుళం మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లాలని అక్కడి పోలీసులు సూచించారు. అయితే, మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదును వెంటనే స్వీకరించకుండా కాలయాపన చేసినట్లు తెలిసింది. ఇక్కడి ఇన్స్పెక్టర్ ప్రవీణ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో అవహేళనగా మాట్లాడటమే కాకుండా దుర్భాషలాడారని బాధితులు ఆరోపించారు.
అటవీ సరిహద్దుల్లో మృతదేహం లభ్యం..
14 గంటల తర్వాత పోలీసులు గాలింపు చేపట్టగా, గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో విద్యార్థిని మృతదేహం గురువారం ఉదయం బయట పడింది. ఆ బాలిక శరీరం గాయాలతో నిండి ఉడటంతో లైంగిక దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని మండిపడుతూ గ్రామస్థులు, బంధువులు వేదనత్తం కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించారు. తూత్తుకుడి – మధురై రహదారిపై ధర్నా చేపట్టడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగాయి. బాలిక మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలనురంగంలోకి దించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మార్కండేయన్ బాధితులను పరామర్శించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా ఎస్పీ మదన్ రంగంలోకి దిగారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విలాతికుళం మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రవీణను సస్పెండ్ చేస్తూ డీఐజీ శరవణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రంగంలోకి ప్రత్యేక బందాలు
నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక పోలీసు బందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. కాగా, ఈ ఘటనపై అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి, పీఎంకే నేత అన్బుమని, టీవీకే నేత విజయ్లు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాలికలు, యువతులు,మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. నిందితులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


