వేలూరు: దేశంలో బాల్య వివాహాల నిర్మూలనకు మహిళలకు ఉన్నత విద్యను అందజేయాల్సిన అవసరం ఉందని వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో మహిళా దినోత్సవం సోమవారం జరిగింది. చాన్స్లర్ మాట్లాడుతూ మహిళలకు ఉన్నత విద్య అందజేయాల్సిన అవసరం ఉందని, ఒక మహిళ విద్యావేత్త అయితే కుటుంబమే కాకుండా సమాజం కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచంలోని పది దేశాల్లో మాత్రమే 50 శాతం మంది మహిళలు పార్లమెంట్లో ఉన్నారని మన దేశంలో 14 శాతం మహిళలు మాత్రమే అధికారంలోకి రాగలుగుతున్నారన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కల్పించే చట్టాన్ని అమలు చేయాలన్నారు. వేలూరు ఉమ్మడి జిల్లాలో అందరికీ ఉన్నత విద్యను అందజేయాలనే ఉద్దేశంతోనే వీఐటీ ఆధ్వర్యంలో అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన మహిళలకు అవార్డులు అందజేశారు. జర్మనీలోని బోయింగ్ ఇంజినీరింగ్ విభాగం డైరెక్టర్ లిండా సార్టో, రెడ్బస్ హ్యూమన్ రిసోర్సెస్ ఉపాద్యక్షులు దివ్య, వీఐటీ ఉపాద్యక్షులు శంకర్ విశ్వనాథన్, శేఖర్ విశ్వనాథన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, వైస్ చాన్స్లర్ కాంచన, రిజిస్ట్రార్ జయభారతి పాల్గొన్నారు.


