పథకాలపై ప్రచారానికి శ్రీకారం
పళ్లిపట్టు: డీఎంకే ప్రభుత్వ పథకాలపై దేశ వ్యాప్తంగా అవగాహన కల్పించే విధంగా డీఎంకే కార్యకర్త బైక్లో ప్రచారానికి పళ్లిపట్టులో ఆదివారం ప్రారంభించారు. ఆర్కేపేట సమీపం అమ్మయార్కుప్పం గ్రామానికి చెందిన సంజీవి(45) డీఎంకే కార్యకర్త. డీఎంకే పార్టీ ద్వారా నిర్వహించే మహానాడులు, సభలకు సైకిల్లో పాల్గొనడం పరిపాటి. అలా సైకిల్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడ సమావేశాలు జరిగినా వెళుతుంటాడు. అదే అలవాటుగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వానికి మద్దతుగా, డీఎంకే పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేసేవారు. ఈక్రమంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం స్టాలిన్ అమలు చేసిన పథకాలు, రాష్ట్రంలో అభివృద్ధి, మహిళల జీవితాల్లో చోటుచేసుకున్న పురోగతిపై బైక్ ప్రచారం ప్రారంభించారు. పళ్లిపట్టు సమీపం బలిజకండ్రిగ నుంచి బైక్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం టీవీఎస్ 50 స్కూటర్లో గొడుగు, డీఎంకే జెండా, బాక్స్, కరపత్రాలు వుంచుకునే బాక్స్ ఏర్పాటు చేసి ప్రచారం మొదలెట్టారు. సంజీవి మాట్లాడుతూ ద్రవిడ సిద్ధాంతాలు, డీఎంకే ప్రభుత్వ విప్లవాత్మక పథకాలపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేపట్టేందుకు వీలుగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ప్రారంభించినట్లు తెలిపారు. ముందుగా తమిళనాడులో ప్రచారం పూర్తిచేసి ఆపై దేశ వ్యాప్తంగా వెళ్లనున్నట్లు తెలిపారు.


