అమ్మకు ఘన నివాళి
న్యూస్రీల్
వాడవాడలా మాజీ సీఎం జయలలిత జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే సేవా కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలో పళణి అంజలి పురిట్చితలైవి జయంతి వేళ పళణి కొత్త వాగ్దానాలు
అధికారంలోకి రాగానే కుటుంబానికి రూ. 10 వేలు చొప్పున ఇస్తామని వెల్లడి
రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో
పురట్చితలైవిగా, అన్నాడీఎంకే వర్గాల మదిలో అమ్మగా గూడు కట్టుకున్న దివంగత సీఎం జె. జయలలిత 78వ జయంతిని
మంగళవారం వాడవాడలా అన్నాడీఎంకే వర్గాలు ఘనంగా నిర్వహించాయి. సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేశారు.
మాజీ సీఎం పన్నీరు సెల్వం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్, చిన్నమ్మ శశికళ శిబిరాల నేతృత్వంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ నివాళులర్పించే కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు.
సాక్షి, చైన్నె: ిసనీ రంగంలోనే కాదు, తమిళ నాడు నుంచి జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన తిరుగు లేని విప్లవ నారి జె. జయలలిత. అందరి హృదయాలలో అమ్మగా గూడు కట్టుకున్న ఆమె భౌతికంగా దూరమైనా ఆమె సేవలు, పథకాలు అజరామరం. మంగళవారం ఆమె జయంతి సందర్భంగా అన్నాడీఎంకే వర్గాలకు ఆమె జ్ఞాపకం చిరస్మరణీయం అన్నట్టుగా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వాడ వాడలలో ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమలతో కేడర్, నేతలు ముందుకెళ్లారు. అన్నదానం, వస్త్ర దానం వంటి కార్యక్రమాలను హోరెత్తించారు. చైన్నె మెరీనా తీరంలోని అమ్మ జయలలిత సమాధిని సుందరంగా తీర్చిదిద్దారు. ఆమె సమాధి వద్ద నేతలు తరలి వచ్చి అంజలి ఘటించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ జయలలితకు నివాళులర్పించినానంతరం విడి విడిగా ఉన్న వాళ్లంతా ఒకే గూటికి చేరాలని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానం పలికారు. తేనిలో జయలలితకు అంజలి ఘటించినానంతరం పన్నీరుసెల్వం మాట్లాడుతూ, తాను కొత్త పార్టీ పెట్టడం లేదని, తాను ఏ తప్పు చేశానో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇక, జయలలితకు నివాళులర్పించిన ఆమె నెచ్చెలి శశికళ రామనాథపురం కౌముదిలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. కాగా, పీఎం మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ పేజీలో జయలలిత సేవలను స్మరిస్తూ ట్వీట్ చేశారు.
పళణి వాగ్దానాల పర్వం
దివంగత నేత ఎంజీఆర్ జయంతి సందర్భంగా అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తొలి జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కుల విలక్కు(ఇంటికి దీపం) పథకం పేరిట కుటుంబం కార్డు దారుకు నెలకు రూ. 2 వేలు నగదు పంపిణీ, సీ్త్రలకు ఇస్తున్నట్టుగానే పురుషులకు సైతం నగర రవాణా బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం, అమ్మ గృహం పథకం, 150 రోజల పాటుగా గ్రామీణ ఉపాధి పథకం అమలు. 5 లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్ర వాహనం పథకం అమలు వంటి 5 వాగ్దానాలు ఉన్నాయి. ఆ తదుపరి ఓ సందర్భంగా మరో 5 వాగ్దానాలతో మరో ప్రకటన చేశారు. ఇందులో వృద్ధులకు నెల వారీ పెన్షన్ను రూ. 1200 నుంచి రూ. 2 వేలకు పెంచడం, విద్యారుణాల రద్దు, పేద కుటుంబాలు, రేషన్ కార్డు దారులకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, జల్లికట్టులో ఎద్దుల దాడిలో మరణించే వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం, గాయపడ్డ వారికి రూ. 2 లక్షలు వైద్య ఖర్చుల కోసం అందజేయడం, ప్రభుత్వ అనుమతితో జరిగే జల్లికట్టు పోటీల నిర్వహణకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అన్న వాగ్దానాలు ఇచ్చారు. తాజాగా దివంగత సీఎం జయలలిత జయంతి సందర్భంగా మరో 6 వాగ్దానాలు చేశారు.
ఎంజీఆర్ మాళిగైలో..
రాయపేటలోని రాష్ట్ర కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలో వేడుకలు జరిగాయి. ఇక్కడకు ఉదయాన్నే వచ్చిన పళణి స్వామికి పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. దివంగత నేతలు జయలలిత, ఎంజీఆర్ విగ్రహాలకు మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, సెల్లూరు రాజు, జయకుమార్, ఎస్పీ వేలుమణి, విజయ భాస్కర్, ఉదయకుమార్, మహిళ నేతలు గోకుల ఇందిర, వలర్మతి, తదితరులతో కలసి పళణిస్వామి నివాళులర్పించారు. పార్టీ జెండాను పళని స్వామి ఎగుర వేశారు. జయలలిత జయంతి సంచికను ఆవిష్కరించారు. మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ రాసిన సామాజిక న్యాయం – పళణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. 78 కేజీల భారీ కేక్ను కట్చేసి అందరికి పంచి పెట్టారు. అన్నదాన కార్యక్రమంతో పాటుగా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం పార్టీ వర్గాలతో సమావేశమయ్యారు.
తాజాగా మరో ఆరు
స్టాలిన్ ప్రభుత్వ అసమర్థతతో పెరిగిన ధరల నేపథ్యంలో వివిధ పన్ను పోటులతో ప్రజల నెత్తిన పడ్డ భారాన్ని తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు ఉపశమనం పేరిట నగదు పంపిణీ చేయనున్నారు.
ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 2,000 భత్యం, ప్లస్– 2 వరకు చదివి ఉపాధి కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి రూ. 1,000 నెలవారి భత్యం అందజేయనున్నారు.
చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ప్రస్తుత ఉపశమన మొత్తాన్ని రూ. 8,000 నుంచి రూ. 12,000 వేలకు పెంచనున్నామన్నారు.
ప్రతి సంవత్సరం పొంగల్(సంక్రాంతి) సందర్భంగా వస్తువుల ప్యాకేజీతోపాటూ రూ. 1000 నగదు అందజేయడం.
చేనేత కార్మికులకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత విద్యుత్తును 300 యూనిట్ల నుండి 450 యూనిట్లకు , పవర్లూమ్ నేత కార్మికులకు 1,000 యూనిట్ల నుండి 1,400 యూనిట్లకు పెంపు.
పట్టణ ప్రాంతాల్లో ఫుట్పాత్ దుకాణాలు కలిగిన చిరు వర్తకులు సహకార బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు.
అమ్మకు ఘన నివాళి


