టీవీకే వైపు బన్రూటి చూపు
సాక్షి, చైన్నె : మాజీ సీఎం పన్నీరు సెల్వంతో రాజకీయ అడుగులు వేస్తూ వచ్చిన సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ తాజాగా విజయ్ టీవీకేతో పొత్తుకు సన్నద్ధమయ్యారు. తాను కొత్తగా ప్రకటించిన ఎంజీఆర్ అన్నాడీఎంకే ఆవిర్భావ సభలో విజయ్ పార్టీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. వివరాలు.. విజయ్ పార్టీ ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తి అయింది. తనతో కలిసి వచ్చే పార్టీలకు అధికారంలో వాటా అని సంకీర్ణ ప్రభుత్వ ప్రకటన చేసిన ఏడాది కావస్తున్న ఇంత వరకు ఏ ఒక్క పార్టీ నుంచి స్పందన లేదు. తాజాగా రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో బన్రూటి రామచంద్రన్ స్పందించారు. తొలుత ఎంజీఆర్ తో కలిసి అన్నాడీఎంకేలో, ఆ తర్వాత జయలలితతో కలిసి అన్నాడీఎంకేలో కీలకంగా రాణించిన బన్రూటి, ఆతర్వాత విజయకాంత్తో డీఎండీకే ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. చివరకు మళ్లీ అన్నాడీఎంకేలో చేరడం, ఇక్కడి వివాదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరు పక్షాన ఆయన వెళ్లడం జరిగింది. తాజాగా పన్నీరును సైతం వీడి ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని ప్రకటించారు. ఆపార్టీ ఆవిర్భావ సభ కాంచీపురంలో జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్యాల పేట ఆర్వీ రంజిత్కుమార్ పేరును ప్రకటించిన బన్రూటి రామచంద్రన్, పొత్తు విషయంగా కీలక ప్రకటన చేశారు. పార్టీ సిద్ధాంతాలు, అన్నాడీఎంకే సిద్ధాంతాలతో సమానంగా ఉండడం, దివంగత ఎంజీఆర్ ఆశయ సాధన నినాదం, వంటి అంశాలతో ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీ రానున్న ఎన్నికలలో విజయ్ టీవీకే తో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఆదిశగా ప్రయత్నాలపై దృష్టి పెడుతున్నామని బన్రూటి తెలిపారు. తాజాగా ఎంజీఆర్ అన్నాడీఎంకే ప్రకటన నేపథ్యంలో అది విజయ్ ప్రకటనకు స్పందించిన తొలి పార్టీగా నిలిచింది.


