దిగ్గజాల దారిలోనే ముందుకు..!
సాక్షి, చైన్నె: రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తనకు రోల్ మోడల్స్ అని టీవీకే అధినేత విజయ్ అన్నారు. వివరాలు.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఆవిర్భవించి రెండేళ్లు కావస్తోంది. కాగా ఏడాది కాలంగా విజయ్ తీవ్ర రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు. పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు మీట్ ది పీపుల్ పేరిట దూసుకెళ్లారు. కరూర్ విషాద ఘటనతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. అయినా ఏ మాత్రం తగ్గకుండా ప్రజలకు పార్టీని దరిచేర్చే విధంగా తన సైన్యాన్ని నడిపిస్తూ వస్తున్నారు. చైన్నె శివారులోని మహాబలిపురం కన్వెన్షన్ సెంటర్ వేదికగా తరచూ పార్టీ సమావేశాలు, సభలు నిర్వహిస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. అయితే విజయ్ ప్రత్యక్షంగా ప్రజలలోకి వచ్చిన కార్యక్రమాలు మరీ తక్కువే. అదే సమయంలో ఆయన మీడియా ముందుకు కూడా రాలేదు. ఈ పరిస్థితులలో ఆయన ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ, రాజకీయ ప్రయాణం గురించి తాజాగా పంచుకున్నారు.
తొలి ఇంటర్వ్యూ..
ఆ టీవీ ఛానల్కు విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూ మేరకు తనకు దివంగత నేతలు ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు రోల్ మోడల్స్గా అభివర్ణించారు. ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే వారికి వారు ప్రేరణగా ఉంటారని వ్యాఖ్యానించారు. 33 సంవత్సరాలు సినిమా జీవితాన్ని వీడడం సులభం కాదంటూ, అయినా, వీడి రాజకీయాలోకి వచ్చానని వ్యాఖ్యానించారు. ఇందులో కింగ్ మేకర్గా కాకుండా కింగ్గా ఉండాలనుకున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఇక తన పూర్తి సమయం రాజకీయాలకే అని స్పష్టం చేశారు. కరూర్ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందని, ఇది తనకు పెద్ద షాక్గా పేర్కొన్నారు. ఈ వేదన ఇంకా తన మనస్సులోనే ఉందని, కొంతకాలం ఈ బాధను అనుభవించక తప్పదన్నారు. ఎన్నికలలో పోటీ చేసి, కష్టపడి గెలవాలన్న లక్ష్యంతో ఉన్నానని, కింగ్ మేకర్గా మాత్ర ఉండబోనని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో మాత్రమే రాజకీయ విజయాన్ని సాధించాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రజల సమస్యల చుట్టూనే ఉండాలని, ప్రజలకు నిజమైన మార్పు తేవడం తన లక్ష్యం అని పేర్కొన్నారు. ఎంజీఆర్ మాత్రం ప్రధాన రోల్ మోడల్ అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ మాట్లాడే విధానం, ఆలోచనా శైలి కూడా తనకు ఇష్టం అని పేర్కొన్నారు. జననాయకన్ చిత్రం గురించి స్పందిస్తూ, ఇది సినిమా మాత్రమే కాదు, ఒక పెద్ద ఉద్యమానికి ప్రతీక అని వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల సమస్యలపై అవగాహన పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్టు వివరించారు.తన భవిష్యత్తుపై స్పష్టత వ్యక్తం చేస్తూ తన భవిష్యత్తు పూర్తిగా రాజకీయాల్లోనే ఉందని, ఇందులో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. తన ప్రయాణం పూర్తి శ్రద్ధ, నిబద్ధతతో ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రయత్నం ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా చెప్పబడుతుందన్నారు. ప్రజల మద్దతు ముఖ్యమని, నిర్ణయాలు అందరికీ లాభదాయకంగా ఉండాలంటూ ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే అనేక కలలు, అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు తన ప్రణాళికలు ఉంటాయని వివరించారు.
విజయ్
34 మందితో ప్రచార సారథులు
ఎన్నికల పనులను వేగవంతం చేసే విధంగా విజయ్ కమిటీలను ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల ప్రచార వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ అంటూ ముందుకు సాగుతూ వచ్చిన విజయ్, తాజాగా ఎన్నికల ప్రచార సారథులను రంగంలోకి దించారు. 34 మందితో కూడిన ఈ కమిటీని విజయ్ శనివారం ప్రకటించారు. ఇందులో పార్టీ నేతలు కుమార్, నిర్మల్ వెంకట రమణన్, అరివళగన్, ఎస్కుమరేషన్, పి. పాండి, మేరుల్లాల్, ఆర్ఎస్ ఇందిర ధనరాజ్, ఆర్ చక్రవర్తి, వెల్లింగ్టన్ ఎం. ధనరాజ్, జె. విజయకుమార్, రేవంత్శరణ్, చకవ్రర్తి, శంకరనారాయణన్, అజిత్కుమార్, మహేంద్రన్, ఇలమారన్, వి. ముత్తుకుమరన్, వెట్రి సెల్వన్, కోకిల రాణి, లూయిస్ రమేష్, పొన్ను స్వామి, మునియప్పన్, ధన శేఖరన్ లతో పాటుగా మదురై, చైన్నె, తిరుపత్తూరు, తంజావూరు తదితర ప్రాంతీయ ప్రతినిధులను సైతం ఈ కమిటీలో నియమించారు.


