క్లుప్తంగా
అన్నామలైయార్ హుండీ ఆదాయం రూ.5.45కోట్లు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి అనంతరం హుండీ లెక్కింపు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులోభాగంగా ఆలయంలో తమిళ తైమాస హుండీ లెక్కింపును బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామి వారి సన్నధి, అమ్మవారు, వినాయకుడి ఆలయప్రాంతాల్లోని 22 హుండీలను ఆలయ జేసీ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందితో లెక్కించగా రూ.5.45కోట్లు, 190 గ్రాముల బంగారం, 2,390 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా వేసినట్లు తెలిపారు. నగదును బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖాతాలోకి జమచేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థులు దేశాభివృద్ధికి సహకరించాలి
వేలూరు: విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధికి సహకరించాలని క్రిష్ణగిరి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అనూరాధ అన్నారు. వేలూరులోని మత్తురంగం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 54వ స్నాతకోత్సవం ప్రిన్సిపల్ శ్రీధరన్ అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రస్తుతం యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన 902 మంది విద్యార్థులు డిగ్రీలు సాధిస్తున్నారనన్నారు. విద్యార్థులు విద్యను ఇంతటితో ఆపేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. మీ జీవితంలో సాధించాల్సినవి అనేకం ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక లక్ష్యం ఉండాలని ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. అధ్యాపకులు, విద్యార్థులు, తల్లీదండ్రులు పాల్గొన్నారు.
లంచం కేసులో వీఏఓ అరెస్ట్
అన్నానగర్: లంచం కేసులో వీఏఓ అరెస్టయ్యారు. నాగై సమీపంలోని సౌత్ పోయిగైనల్లూర్కు చెందిన తంబియప్పన్, ఇతను సౌత్ పోయిగైనల్లూరు గ్రామ పరిపాలనా అధికారి శబరినాథన్ను కలసి భూమి హక్కు బదిలీ వివరాలు అడిగారు. ఆ సమయంలో భూమి హక్కు బదిలీ కోసం శబరినాథన్ రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని తంబియప్పన్ ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని తరువాత, అధికారుల ఆలోచన ప్రకారం తంబియప్పన్ రసాయనం పూసిన నగదును శబరినాథన్కు ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు.
హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
అన్నానగర్: సెంగోట్టై సమీపంలో వృద్ధురాలిని కొట్టి చంపిన కేసులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురికి తెన్కాశీ కోర్టు జీవిత ఖైదు విధించింది. తెన్కాశీ జిల్లాలోని సెంగొట్లై సమీపంలో విశ్వనాథపురానికి చెందిన మహ్మద్ యూసఫ్. ఇతని భార్య ముంతాజ్ (65). ఇతను తన కుమార్తె, మనవడికి తరచూ డబ్బు ఇస్తుంటాడు. దీంతో సెంగోట్టైకి చెందిన బంధువులు అబ్దుల్ సలాం, అబ్దుల్ జాబర్ (52) ఖాదర్ మిర్జా(52) అమీనా (40), ఫాతిమా బీబి (48) ఆగ్రహించి 2020, డిసెంబర్ 10న ఐదుగురు ముంతాజ్ను కుక్కర్తో కొట్టి చంపారు. అల్లుడు అబ్దుల్ ఖాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. కేసు తెన్కాసి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి రాజవేలు సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఐదుగురు నిందితులు అబ్దుల్ సలాం, అబ్దుల్ జాబర్, ఖాదర్ మిర్జా, అమీనా, ఫాతిమా బీబీలకు జీవిత ఖైదు విధించారు.
నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
తిరువళ్లూరు: పీఎం జన్మన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతాప్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి యూనియన్లోని కాట్టుపాక్కం, తిరుమణం, చెమరంబాక్కంతోపాటు వేర్వేరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పక్కాగృహాలను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పారివాక్కంలో రూ.78.20 లక్షలతో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం పూర్తయిన క్రమంలో వాటిని త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కాట్టుపాక్కంలో రూ.92.99 లక్షలు, చెమరంబాక్కంలో రూ.81.44 లక్షలు, తిరుమణం పంచాయతీలో రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న పక్కాగృహాలు 60 శాతం పూర్తయ్యాయన్నారు. పనులను నాణ్యతగా చేయాలని, నాణ్యతను తరచూ అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు.
క్లుప్తంగా
క్లుప్తంగా


