ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్
బ్రాడ్ వేలో
ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్, మల్టీ మోడల్
కాంప్లెక్స్గా బ్రాడ్ వే బస్టాండ్
రూపుదిద్దుకోనుంది. రూ. 822.70 కోట్లతో ఉత్తర చైన్నెకు సరికొత్త ఐకాన్గా నిర్మితం కానున్న ఈ పనులకు గురువారం సీఎం
ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు.
బ్రాడ్వే బస్టాండ్ నమూనాను పరిశీలిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెలో తొలి బస్టాండ్గా 1960లో బ్రాడ్వేలో పునాదిపడిన విషయం తెలిసిందే. 1964లో ప్రయాణికుల సేవలోకి బ్రాడ్ వే బస్టాండ్ను తీసుకొచ్చారు. ఇక్కడి నుంచే ఒకప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలు, నగర కేంద్రాలు, పొరుగు రాష్ట్రాలకు బస్సులు బయలుదేరి వెళ్లేది. కాల క్రమేనా నగరం విస్తరించడం, ట్రాఫిక్ పెరగడం వెరసి కోయంబేడులో బ్రహ్మాండ బస్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. 2002 నవంబర్ నుంచి కోయంబేడు బస్టాండ్ ఉపయోగంలోకి వచ్చింది. ఆ తదుపరి బ్రాడ్ వే బస్టాండ్ను ఎంటీసీ బస్సుల సేవలకు పరిమితం చేశారు. ఇక్కడి నుంచి ఎంటీసీ బస్సులు నగరంలో పలు ప్రాంతాల వైపుగా సేవలు అందిస్తూ వచ్చాయి. ఈ పరిస్థితులలో బ్రాడ్ వే బస్టాండ్ స్థానంలో బ్రహ్మాండ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి ఎంటీసీ బస్టాండ్ను తాత్కాలికంగా ఐల్యాండ్ గ్రౌండ్, రాయపురంకు గత వారం మార్చారు.
నాలెడ్జ్ సిటీకి పునాది
అనంతరం కలైవానర్ అరంగంలో జరిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో తమిళనాడు నాలెడ్జ్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ సమక్షంలో విజ్ఞానం, ఆవిష్కరణ, నైపుణ్యాల అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో తమిళనాడును కేంద్రంగా బలోపేతం చేయడానికి, వివిధ దేశాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలతో ప్రభుత్వ ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు శేఖర్బాబు, కోవిచెలియన్, టీఆర్పీ రాజా, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ తదితరులు హాజరయ్యారు. ముందుగా ఉదయం సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి కోయంబత్తూరులోని కొడిసీయా ఆడిటోరియంలో తమిళనాడు ప్రభుత్వ టెక్స్టైల్ మిల్లు డిపార్ట్మెంట్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించారు. పారిశ్రామిక సంపద, వినూత్న ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశంలోని మాంచెస్టర్ అయిన కోయంబత్తూర్ వేదికగా ఈ తొలి సమావేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. తమిళనాడులో సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తూ, అన్ని జిల్లాలకు విస్తృత అభివృద్ధి దిశగా ముందుకెళ్తోన్నామన్నారు. తమిళనాడు ఇంటిగ్రేటెడ్ న్యూ టైకె ్స్టల్ పాలసీ 2025–2026’ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఇలా ఉండగా యూజీసీ నిబంధనలలో సవరణలు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం స్టాలిన్ ఆహ్వానించారు.
ఆధునిక హంగులతో..
చైన్నె నగర శివారులలోని సబర్బన్ బస్ టెర్మినల్స్, నగరంలోని ప్రధాన ప్రాంతాలలో ఽఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బ్రాడ్ వే బస్టాండ్ ఉన్న ప్రదేశంలో మల్టీ మోడల్ ఫెసిలిటీ కాంప్లెక్స్తో పాటూ ఇంటిగ్రేటెడ్ న్యూ బస్ టెర్మినల్ నిర్మాణానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం చర్యలు తీసుకుంది. రూ.822.70 కోట్ల అంచనాతో ఇక్కడ నిర్మాణాలు జరగనున్నాయి. చైన్నె కార్పొరేషన్లోని బస్టాండ్లలో బ్రాడ్ వేను మల్టీ–మోడల్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ బస్ స్టేషన్, మల్టీ మోడల్ ఫెసిలిటీ కాంప్లెక్స్ (ఎంఎంఎఫ్సీ)గా తీర్చిదిద్దబోతున్నారు. ఈ పరిసరాలలోని ఎంటీసీ, ఈఎంయూ, ఎంఆర్టీఎస్, మెట్రో సేవలను ఒకే వేదిక మీదకు తెచ్చే దిశగా నిర్మాణాలు జరగబోతున్నాయి. ఈ పనులకు గురువారం సీఎం స్టాలిన్ శంఖు స్థాపన చేశారు. ఇక్కడ జరగనున్న నిర్మాణాలకు సంబంధించిన నమూనాను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్లో 2 అంతస్తుల్లో బేస్మెంట్, 2 అంతస్థుల బస్ స్టాప్, 6 అంతస్థులలో కమర్షియల్ కాంప్లెక్స్గా పది అంతస్తులతో రూపుదిద్దుకోనున్నది. 433 నాలుగు చక్రాల పార్కింగ్ స్థలాలు, 1,174 ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాలు వంటి సౌకర్యాలతో అన్ని రకాల ఆధునిక హంగులతో నిర్మాణాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కె ఎన్. నెహ్రూ, ఆర్.ఎస్. రాజకన్నప్పన్, పి.కె. శేఖర్ బాబు, మేయర్ ఆర్. ప్రియ, తదితరులు పాల్గొన్నారు.
రూ.21.50 కోట్లతో వివాహ వేదిక
ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా తిరువికా నగర్ నియోజకవర్గం పరిధిలోని పెరంబూరులో చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ సంస్థ నేతృత్వంలో రూ. 21. 50 కోట్లతో నికర్మించిన అంబేడ్కర్ వివాహ వేదికను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. 10 జంటలకు ఈసందర్భంగా సామూహిక వివాహాలు జరిగాయి. కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు రాజధాని నగరం చైన్నెలో బ్రహ్మాండగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. ఇందులో ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టు కీలకంగా మారి ఉందన్నారు. రూ. 516 కోట్లతో 19 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. రోడ్లు, వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇక్కడున్న కొత్త జంటలకు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, పుట్టబోయే పిల్లలకు దయ చేసి అందమైన తమిళ పేర్లు పెట్టాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్
ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్


