రీ రిలీజ్కు శింబు సిలంబాట్టం
తమిళసినిమా: ఇప్పుడు గతంలో విడుదలైన భారీ చిత్రాలు రీ రిలీజ్ కావడం పరిపాటిగా మారింది. అలాంటి చిత్రాలు మళ్లీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడమే ఇందుకు కారణంగా భావించవచ్చు. ఇటీవల నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన మంగాత్తా చిత్రం థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నటుడు శింబు కథానాయకుడిగా నటించిన సిలంబాట్టం చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 2008లో విడుదలైన ఈ చిత్రాన్ని లక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై కె మురళీధరన్, బి. స్వామినాథన్ , టీఎస్ రంగరాజన్ కలిసి నిర్మించారు. ఎస్. శరవణన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు శింబు గ్రామీణ యువకుడు నగరం యువకుడు అంటూ రెండు పాత్రను పోషించారు. ముఖ్యంగా ఇది సిలంబాట్టం అనే క్రీడ నేపథ్యంలో సాగే కథ చిత్రంగా ఉంటుంది. ఇందులో నటి స్నేహ, సనూష హీరోయిన్లుగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. యాక్షన్, మదర్ సెంటిమెంటు, ప్రేమ వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను అలరించింది . కాగా దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఫిబ్రవరి 6న తెరపైకి తీసుకు వస్తున్నట్లు నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా థగ్లైఫ్ చిత్రం తర్వాత సింబు నటించిన మరో చిత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో సిలంబాట్టం చిత్రం రీ రిలీజ్ ఆయన అభిమానులను ఖుషీ నిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.


