క్లుప్తంగా
విమాన సేవలకు
పెరగనున్న డిమాండ్
సాక్షి, చైన్నె: భారత్ – యూఏఈ మధ్య విమాన ప్రయాణ సేవల డిమాండ్ పెరుగనున్నట్టు టూరిజం ఎకనామిక్స్ కన్సల్టింగ్ డైరెక్టర్ మాథ్యూ దాస్ వ్యాఖ్యానించారు. అయితే డిమాండ్ను పూర్తిస్థాయిలో తీర్చ లేని పరిస్థితులు ఉంటాయన్నారు. యూఏఈ విమాన ప్రయాణ డిమాండ్ల గురించి జరిపిన అధ్యయన నివేదిక వివరాలను స్థానికంగా ప్రకటించారు. ఆ మేరకు రానున్న దశాబ్దంలో ప్రయాణ డిమాండ్లో 27 శాతం తీర్చలేని పరిస్థితులు ఉంటాయని తమ అధ్యయనంలో వెలుగు చూసిందన్నారు. సీట్ల సామర్థ్యం , ప్రస్తుతం ఉన్న పరిమితులు , పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా ఉండక పోవచ్చునని వివరించారు. ఈ కారణంగా బలమైన వాయు కనెక్టివిటీ మద్దతు ఇవ్వగల ఆర్థిక ప్రయోజనాలు తగ్గే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 2026– 2035 మధ్య సుమారు 54.5 మిలియన్ల ప్రయాణికులకు ప్రయాణాల కొరత తప్పదన్నారు. అబుదాబి – ఇండియా కారిడార్లో మాత్రమే 13.2 మిలియన్ల మందికి సేవలు అందించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటయాన్నారు. పెరుగుతున్న ఆదాయాలు, అంతర్జాతీయ వాణిజ్యం విస్తరణ, అవుట్ బౌండ్, ఇన్ బౌండ్ పర్యాటకం డిమాండ్ పెరుగుదలకు మద్దతుగాఉంటాయని వ్యాఖ్యానించారు.
ఘనంగా జాతీయ
ఓటర్ల దినోత్సవం
తిరువళ్లూరు: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరు తాలుకా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు భారీ ర్యాలీ, వేర్వేరు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తాలుకా కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని ఆర్డీఓ రవిచంద్రన్ ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో పేరు వున్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య హక్కును పరిరక్షించాలన్నారు. ఓటర్లు జాబితాలో పేర్లు లేని వారు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కును నిజాయితీగా ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తాలుకా కార్యాలయంలో విద్యార్థులు నిర్వహించిన విల్లుపాట, అవగాహన నాటకం, పాటలు పలువురిని ఆకట్టుకుంది. తహసీల్దార్ బాలాజీ పాల్గొన్నారు.
నవ వధువు మోసం
అన్నానగర్: తిరుచెందూరు సమీపంలో పెళ్లి అయిన రెండు రోజులకే నగలు, డబ్బు దొంగిలించిన యువతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. రామస్వామిపురం ప్రాంతానికి చెందిన భాస్కర్ (35) తిరుచెందూర్ ఆలయ ప్రాంగణంలో పండ్లు విక్రయించేవారు. ఇతడికి సాతంగుళంకు చెందిన ముక్కాండి అనే వివాహ బ్రోకర్తో పరిచయం ఏర్పడింది. సదరు బ్రోకర్ నాగర్ కోయిల్కు చెందిన ఓ మహిళను పరిచయం చేశాడు. తద్వారా భాస్కర్ నుండి రూ. 40.వేలు కమీషన్ పొందాడు. పెళ్లికి సిద్దంగా ఉన్న భాస్కర్, ఆ నిరుపేద యువతికి అవసరమైన బట్టలు, చీర సహా ఇతర వస్తువల కోసం రూ. 10ఇచ్చాడు. 20వ తేదీ ఉదయం తిరుచెందూర్లోని శివాలయం వెనుక ఉన్న దుర్గా అమ్మన్ ఆలయం ముందు ఆ యువతి మెడలో 4 గ్రాముల బంగారు తాళిని కట్టి వివాహం చేసుకున్నాడు. తరువాత భాస్కర్ ఆ యువతిని తన ఇంటికి తీసుకువచ్చాడు.
ఆ తర్వాత ఆ రోజులు ఆ యువతి భాస్కర్తో కలిసి అదే ఇంట్లో నివసించింది. అయితే 22వ తేదీ ఉదయం భాస్కర్ ఇంట్లో వంటకు అవసరమైన పదార్థాలు కొనడానికి తిరుచెందూర్ వెళ్లి తిరిగి వచ్చినప్పుడు భార్య ఇంట్లో లేకపోవడం వెతికాడు. 10,000 నగదు, బట్టలు లేకపోవడం, భాస్కర్ సెల్ఫోన్లోని చిత్రాలు, ఆధారాలను కూడా తొలగించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఐజీ కార్యాలయ అధికారి
ఇంట్లో చోరీ
తిరువొత్తియూరు: ఐజీ కార్యాలయ అధికారి ఇంట్లో 6 కిలోల వెండి వస్తువులు, 12 గ్రాముల బంగారు నగలు చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుప్పువనం భాగ్యానకరైకి చెందిన నాగసుందరి (55) మధురైలోని ఐజీ కార్యాలయంలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మణి పోలీసు శాఖలో ఆపీస్ అసిస్టెంట్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మణి అనారోగ్యంతో మధురైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేరి చికిత్స పొందుతున్నారు. నాగసుందరి తన భర్తతో కలిసి ఆసుపత్రిలో బస చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం నాగసుందరి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఈ విషయంపై స్థానికులు ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆమె నేరుగా తన ఇంటికి వచ్చి చూడగా, బీరువాలోని 6 కిలోల వెండి వస్తువులు, 12 గ్రాముల బంగారు ఉంగరం చోరికి గురైనట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


