నూతన విద్యా విధానాన్ని అంగీకరించం
తిరువళ్లూరు: కులమత వర్ణ విభేదాలు లేకుండా అందరికి విద్యను అందించాలనే డీఎంకే విధానానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని అందుకే నూతన విద్యా విధానం ద్వారా కులవృత్తిని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు శానసనభ స్పీకర్ అప్పావు ఆరోపించారు. తిరువళ్లూరులోని నాడార్ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న కామరాజర్ మెట్రిక్ పాఠశాల 30వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి ట్రస్టీ అద్యక్షుడు తిరువడినాడార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా స్పీకర్ అప్పావు, స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరయ్యారు. అప్పావు మాట్లాడుతూ కామరాజర్ ఆశయాలకు అనుగుణంగా పాఠశాలను ఏర్పాటు చేసి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడం శుభపరిమాణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రను సరిగ్గా పోషించలేకపోతోందని, నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని డీఎంకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను నిలిపివేసిందన్నారు. నూతన విద్యావిదానం ద్వారా పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుందన్న ఉద్దేశంతోనే తాము అమలు చేయలేదని అందుకు విద్యా రుణం కింద రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తే కులవృత్తి వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తుందని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత గత ఐదేళ్లలో 47 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. అసెంబ్లీలో గవర్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకుండా తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలిస్తే దీంతో బీజేపీ కూటమికి నష్టం కలుగుతుందన్న బాధతోనే అసెంబ్లీ నుంచి నిష్క్రమించారని వాపోయారు. హిందీ చదువుకుంటే ఉన్నత పదవులకు వెళ్లొచ్చని గవర్నర్ భావిస్తున్నారని, అయితే హిందీ చదివిన చాలా మంది నార్త్ ఇండియన్స్ తమిళనాడులో కూలీ పనులు చేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలని ఆయన అన్నారు. డీఎంకే మ్యానిఫెస్టోను చూసి అన్నాడీఎంకే నేతలు కాపీ కొడుతున్నారని, అయితే రాష్ట్ర ప్రజలకు డీఎంకే చేసిన మంచిని వారు మర్చిపోరన్నారు.


