టీఎన్సీసీ నేతలతో రాహుల్ భేటీ
సాక్షి,చైన్నె: టీఎన్సీసీ నేతలతో 18,19 తేదీల్లో ఢిల్లీలో భేటీకి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ భేటీ తర్వాత డీఎంకే సీట్ల పందేరం వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం వ్యవహారంపై కాంగ్రెస్లో నేతలు తలా ఓ మాట, తలా ఓ ఆరోపణ, విమర్శలు గుప్పిస్తూ రావడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ యాభైకు పైగా సీట్లను ఆశిస్తున్న నేపథ్యంలో అందులో సగం సీట్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో డీఎంకే లేనట్టుగా వెలువడ్డ సంకేతాలతోనే తలా ఓ మాట మాట్లాడే పనిలో టీఎన్సీసీ వర్గాలు ఉన్నట్టు సమాచారం.ఈ పరిస్థితులలో టీఎన్సీసీ నేతలతోపాటు ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రత్యేక కమిటీతో రాహుల్ గాంధీ భేటీకి నిర్ణయించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలసి 18,19 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న ఈ భేటీకి రాష్ట్ర నాయకులకు పిలుపువచ్చింది. దీంతో కూటమి, సీట్ల పందేరం కసరత్తులపై చర్చించి రాహుల్ వ్యూహాలను, నిర్ణయాలను అమలు చేసే దిశగా టీఎన్సీసీ వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదేసమయంలో కాంగ్రెస్లో ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్న విషయం తెలిసిందే. 5,500మంది దరఖాస్తులు చేసుకుని ఉండడంతో ఈ జాబితాను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు టీఎన్సీసీ వర్గాలు సిద్ధమవుతున్నాయి.
18 నుంచి
సముద్రంలోకి శివగంగై
● నాగై నుంచి కాంగేశంకు నౌక సేవ
సాక్షి, చైన్నె: తమిళనాడులోని నాగపట్నం– శ్రీలంకలోని కాంగేశం హార్బర్ మధ్య నౌక సేవకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆదివారం అఽధికారులు ప్రకటించారు. ఈనెల 18 నుంచి రెండు దేశాల మధ్య నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగు దశాబ్దాల అనంతరం తమిళనాడు–శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌక నడిపేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సిరియపాణి అని నామకరణం చేసిన నౌకను తొలుత రంగంలోకి దించారు. స్పందన శూన్యం కావడంతో కొన్నాళ్లు సేవలు మూతపడ్డాయి. చివరకు గత ఏడాది సిరియపాణి పేరును శివగంగైగా మార్చేశారు. ఇందులో 150 మంది ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వీసా లేకుండా నౌక ప్రయాణానికి సంబంధించిన అనుమతులు మంజూరు కావడంతో గత ఏడాది స్పందన ఆశాజనకంగానే వచ్చింది. ఈశాన్య రుతు పవనాల సీజన్తో కొన్ని నెలలు సేవలను నిలుపుదల చేశారు. తాజాగా మళ్లీ పునరుద్ధరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. శివగంగై పేరిట ఈ నౌక సేవలు మే 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. ఇందులో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు.
కరూర్లో కేంద్ర బృందం
● వేలుస్వామిపురంలో పరిశీలన
సాక్షి, చైన్నె: కరూర్లోని వేలుస్వామిపురంలో శుక్రవారం కేంద్ర హోంశాఖ అధికారుల బృందం, ఫోరెన్సిక్ నిపుణుల బృందం సమగ్ర పరిశీలన జరిపింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ గత ఏడాది సెప్టెంబరు 27వ తేదీన కరూర్లో నిర్వహించిన ప్రచారంలో చోటు చేసుకున్న విషాద ఘటనను సీబీఐ విచారిసోంది. ఈ ఘటనలో 41 మంది మరణించగా 160 మంది గాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే కరూర్లో విచారణను ముగించి ఢిల్లీకి సీబీఐ అధికారులు చేరారు. టీవీకే ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి మరీ విచారించారు. అలాగే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు సైతం ఢిల్లీలో విచారణకు హాజరై వచ్చారు. అదే సమయంలో ఈ కేసులో విజయ్ను సైతం విచారించేందుకు సీబీఐ చర్యలు తీసుకుంది. ఈ నెల12న ఆయన విచారణకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు ఇప్పటికే సమన్లు అందినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితులలో శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర హోం శాఖ అధికారుల బృందం, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మరో బృందం రంగంలోకి దిగింది. కరూర్లోని వేలుస్వామిపురంలో ఈ బృందం సమగ్ర పరిశీలన, విచారణను నిర్వహించడం గమనార్హం.
టీఎన్సీసీ నేతలతో రాహుల్ భేటీ


