క్లుప్తంగా
ఈవీల ప్రోత్సాహానికి ఒప్పందం
సాక్షి, చైన్నె : ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు యాక్సిస్ బ్యాంక్తో జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. డ్యూయల్ లోన్ సొల్యూషన్ ద్వారా ఒక ప్రత్యేకమైన ఈవీ యాజమాన్య కార్యక్రమాన్ని పరిచయం చేశారు. స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఎంజీ మోటారు ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా, యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునీష్ శారద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీఏఏఎస్ స్మార్ట్ ఎకనామిక్స్తో అత్యాధునిక మొబిలిటీని అనుభవించేందుకు వీలుంటుందన్నారు. మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు ప్రయాణానికి మార్గం అని వ్యాఖ్యానించారు. వినియోగదారులతో స్నేహపూర్వక సంప్రదింపు, పరిష్కారాలకు అందించేందుకు , వాహన రుణాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం మరింత దోహదకరంగాఉంటుందని ప్రకటించారు.
నిరంతర ఆవిష్కరణలపై దృష్టి
సాక్షి, చైన్నె: వినియోగదారుల కోసం వినోద అనుభవాన్ని మెరుగు పరిచేందుకు నిరంతర ఆవిష్కరణలపై దృష్టి పెట్టామని టాటా ప్లే చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవిపూరి తెలిపారు. టాటా ప్లే వినియోదారుల కోసం అన్ని వేదికల్లో ఆపిల్ మ్యూజిక్ను యాక్సెస్ చేస్తూ, మొబైల్ యాప్, టాటా ప్లే బింగే, టాటా ప్లే ఫైబర్ల గురించి గురువారం స్థానికంగా ఆమె వివరించారు. 100 మిలియన్లకు పైగా పాటలు, క్యూరేటెడ్ ప్లే జాబితాలు, లైవ్రేడియో అన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని వివరించారు. వినియోగదారులకు 4 నెలలు ఉచిత సేవకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. టాటా ప్లేతో తమ సహకారాన్ని విస్తరించడం, భాగస్వామ్యం, ఆపిల్ మ్యూజిక్ ఏకీకరణ, ఆడియో అనుభవాలను గురించి ఈ సందర్భంగా ఆపిల్ ఇండియా కంటెంట్ అండ్ సర్వీసెస్ డైరెక్టర్ షాలిని వివరించారు.
సీఐటీయూ రాష్ట్ర సమావేశాలు ప్రారంభం
కొరుక్కుపేట: సీఐటీయూ 16వ రాష్ట్ర సమావేశాలు కోయంబత్తూరులో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెల 6వ తేదీ వరకు 4 రోజులు పాటు జరగనున్నాయి. కోయంబత్తూరులోని నవ ఇండియా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాలులో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని ఆ పార్టీ అఖిల భారత మాజీ అధ్యక్షుడు థాపన్సేన్ ప్రారంభించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సౌందర్రాజన్, మాజీ ఎంపీ డీకే రంగరాజన్తో 850 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్ ప్రసంగించారు, కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడం, ప్రమాద రహిత బాణసంచా ఉత్పత్తిని నిర్ధారించడం, మైనింగ్ కార్మికులకు గృహనిర్మాణం వంటి తీర్మానాలను ఆమోదించారు.
భవనాలు త్వరగా పూర్తి చేయండి
కొరుక్కుపేట: కపాలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైనన్స్ కళాశాలలో నిర్మిస్తున్న భవనాలు త్వరగా పూర్తి చేయాలని హిందూధర్మాదాయ శాఖా మంత్రి పి.కె. శేఖర్ బాబు అన్నారు. చైన్నెలోని కపాలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైనన్స్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఆయన పరిశీలించారు. పనులు త్వరగా చేపట్టాలని అధికారులు, ఇంజినీర్లను కోరారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 800 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఈ కళాశాల విద్యార్థులకు కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి ద్వారా ట్యూషన్ ఫీజులు స్టయిఫండ్ అందిస్తున్నట్లు తెలిపారు. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా వివిధ నియామకాలను విద్యార్థులు పొందుతున్నారని చెప్పారు. వారికి రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు జీతం వస్తోందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కళాశాల కొత్త భవనంలో పనిచేస్తుందని, రెండవ దశలో, దాదాపు 2,500 మంది విద్యార్థులు వసతి కల్పించడానికి తరగతి గదులు, హాస్టల్, ఆట స్థలం, శారీరక శిక్షణ హాల్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు.
భారతీయ వైద్య చరిత్రలో అరుదైన ఘనత
కొరుక్కుపేట: థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 5 ఏళ్ల చిన్నారికి అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. భారతీయ వైద్య చరిత్రలో అరుదైన ఘనత సృష్టించారు. థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్న దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన పశ్చిమ బెంగాల్కు చెందిన 5 ఏళ్ల 10 నెలల బాలికకు చైన్నెలోని అపోలో చిల్డ్రనన్స్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్స చేసి, పీడియాట్రిక్ సర్జికల్ ఆంకాలజీలో ఒక గొప్ప మైలురాయిని సాధించారు. చిన్నారి మెడలో వాపు గమనించిన ఆమె తండ్రి ఆ బిడ్డను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు పిల్లల్లో అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ అయిన పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా బయటపడింది. సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ, హెడ్అండ్నెక్ సర్జన్ డాక్టర్ బాలాజీ ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించి చికిత్స చేశారు. అపోలో చిల్డ్రనన్స్ హాస్పిటల్స్ హెడ్ అండ్ నెక్, స్కల్ బేస్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రకాష్ దురైసామి, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ జీనత్ మాలావత్ కన్సల్టెంట్ ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉండటంతో పాటు , గాయం నయం అయింది, స్వరం దాదాపు సాధారణంగా వచ్చిందని వైద్యులు వెల్లడించారు.


