
క్లుప్తంగా
108లో ఆక్సిజన్ లేక రోగి మృతి
తిరువొత్తియూరు: చైన్నె దురైపాక్కం ఎళిల్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివసించే రాజేష్ (39) మంగళవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతని బంధువులు 108 అంబులెన్స్లో రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్లో రాజేష్ను పరీక్షించిన అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు అతనికి ఆక్సిజన్ అవసరమని తెలిపారు. రాజేష్కు ఆక్సిజన్ ఇవ్వడానికి యత్నించగా ఆక్సిజన్ రాలేదు. ఈ విషయాన్ని అంబులెన్స్ టెక్నీషియన్, డ్రైవర్తో చెప్పారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లి ఆక్సిజన్ అవసరాన్ని చూసుకోవచ్చు అని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపాడు. తరువాత రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన రాజేష్ కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ ఇవ్వకుండా అంబులెన్స్లో తీసుకువచ్చినందువల్లే రాజేష్ మరణానికి కారణమని బంధువులు ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి, ఆసుపత్రి ఉద్యోగులతో మరణించిన రాజేష్ బంధువులు మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించే అంబులెన్స్ వాహనాల్లో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల నిరుపేదల ప్రాణాలు బలి అవుతున్నాయని సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి, రాజేష్ బంధువులు ఆసుపత్రి స్టేషన్ వైద్య అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఉచిత నర్సింగ్ శిక్షణ ప్రారంభం
వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ నారాయణి ఆసుపత్రిలో 50 మంది విద్యార్థులకు ఉచిత డిప్లమో కోర్సులను ఎమ్మెల్యే నందకుమార్ ప్రారంభించారు. బంగారు గుడి పీఠాధిపతి శక్తి అమ్మ అధ్యక్షతన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన జన్మ దినోత్సవాన్ని పురష్కరించుకుని మంగళవారం ఉదయం ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన నారాయణి ఆసుపత్రిలో ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శక్తి అమ్మ జయంతి సందర్బంగా ప్రస్తుతం ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థినిలు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రోగులకు సేవ చేసేందుకు ఆసక్తి చూపాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం అనేక మంది ఉద్యోగాలకు వెల్లడం ద్వారా వారి తల్లిదండ్రులను చూసుకునేందుకు సమయం లేక ఇంటిలోనే నర్శులను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొంది మీ ప్రాంతంలోనే ఉంటూ నెలకు సుమారు రూ. 20 వేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉండడంతో ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాధవి, డాక్టర్ గీత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులు
తిరుత్తణి: తిరుత్తణిలో రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపల్ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. తిరుత్తణి మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి అధ్యక్షత వహించారు. వైస్ చైర్మన్ స్వామిరాజ్ స్వాగతం పలికారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆదాయ ఖర్చుల వివరాల పట్టిక ప్రవేశపెట్టారు. పట్టణంలోని 21 వార్డులో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ. కోటి వ్యయంతో సిమెంట్ రోడ్లు, తాగునీటి పైపులైన్లు ఏర్పాటు సహా నిత్యావసర అవసరాలు కోసం సభ్యులు తీర్మానం ఆమోదించారు. అలాగే చిరు వ్యాపారులు రోడ్డు మార్గాల్లో వ్యాపారాలకు సంబంధించి ఏడాదికి సుంకం చెల్లింపునకు సంబంధించి సమావేశంలో అనుమతిస్తూ తీర్మానం ఆమోదించారు. తాగునీటి కనెక్సన్ కోసం మున్సిపాలిటీకి ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలకు చెల్లింపులకు సంబంధించి తీర్మానించారు.
జైలు ఖైదీకి గంజాయి
తిరువొత్తియూరు: చైన్నె పుళల్ జైలులో ఖైదీకి గంజాయి సరఫరా చేసిన లాయర్పై పోలీస్ స్టేషన్న్లో ఫిర్యాదు నమోదైంది. చైన్నె సెంట్రల్ జైలులోని రెండో నంబర్ గదిలో విచారణ ఖైదీ శిలంబరసన్ (28) గంజాయి దాచిపెట్టినట్లు జైలు అధికారులకు రహస్య సమాచారం అందింది. దీని ఆధారంగా జైలు అధికారులు ఖైదీ శిలంబరసన్ గదికి వెళ్లి తనిఖీ చేశారు. అప్పుడు టాయిలెట్లో దాచిపెట్టిన 54 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జైలు గార్డులు గంజాయి దాచిపెట్టిన విషయంపై ఖైదీ శిలంబరసన్న్ను విచారించగా, దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈక్రమంలో ఉదయం ఖైదీ శిలంబరసన్న్ను కలవడానికి వచ్చిన అతని లాయర్ హేమంత్, గంజాయిని రహస్యంగా తీసుకొచ్చి, ఇంటర్వ్యూ జరిగిన ప్రదేశంలో గంజాయిని విసిరి వెళ్లిపోయినట్లు, ఆ తర్వాత ఖైదీ శిలంబరసన్ ఆ గంజాయిని తీసుకుని టాయిలెట్లో దాచిపెట్టినట్లు తెలిసింది.

క్లుప్తంగా