
2 వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ సిటీ
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వేదికగా బ్రహ్మాండ అంతర్జాతీయ నగరం రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రాజెక్టు సమగ్ర నివేదిక సమర్పణకు టెండర్లను ఆహ్వానించారు. రాజధాని నగరం చైన్నె శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. శివారులలోని కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల పరిధిలోని ప్రాంతాలన్నీ నగరంలోకి కలిసినట్టుగా పరిస్థితులు ఉన్నాయి. మూడో మాస్టర్ ప్లాన్ అమల్లో ఈ మూడు జిల్లాలే కాదు, రాణి పేట జిల్లా పరిధిలోని అరక్కోణం సైతం చైన్నె పరిధిలోకి రానుంది. నగరం విస్తీర్ణం పెరగనున్నది. ఈపరిస్థితులలో చైన్నె శివారులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం వివిధ నిర్మాణాలను వేగవంతం చేసింది. చైన్నెతోపాటూ కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై వంటి నగరాలపై సైతం ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మాణాలకు ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో చైన్నె శివారులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో ఆరిథక, వ్యాపార, సమాచార, సాంకేతిక , పరిశోధన తదితర అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఓ నగరం రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. 2 వేల ఎకరాలలో ఈ నగరం రూపకల్పన చేయడానికి స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ నగరంలో అన్ని రకాల సంస్థలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు, బ్యాంకింగ్సేవలు, సమావేశ మందిరాలు, విద్య, ఆరోగ్య సేవలతో కూడిన వసతులు....ఇలా మరెన్నో నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించి అమలు చేయడానికి టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించడం విశేషం.