న్యూస్రీల్
అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం ఉదయ నిధి
396 ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
2,810 మంది ఉపాధ్యాయుల నియామకం
సాక్షి, చైన్నె: గురువులకే నిరంతరం ద్రావిడ మోడల్ ప్రభుత్వ మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులందరికీ అండగా ఉంటామని, అందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. 396 మంది ఉపాధ్యాయులను ఉత్తమ అవార్డులతో ఆయన సత్కరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని విద్యా శాఖ నేతృత్వంలో చైన్నెలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరిగింది. ఇందులో 396 మంది ఉపాధ్యాయులకు రాధాకృష్ణన్ పేరిట ఉత్తమ అవార్డులను ప్రదానం చేశారు. అలాగే, ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేసిన 2,810 గ్రాడ్యుయేట్ టీచర్ల నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం సుబ్రమణియన్, పీకే శేఖర్బాబు, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, మేయర్ ప్రియ విద్యా శాఖ కార్యదర్శి చంద్రమోహన్, తమిళనాడు పాఠ్యపుస్తకాలు, విద్యా కార్పొరేషన్ చైర్మన్ దిండిగల్ ఐ.లియోని, పాఠశాల విద్యా డైరెక్టర్ ఎస్. కన్నప్పన్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రసంగిస్తూ, ఉపాధ్యాయులందరికి శుభాకాంక్షలు, అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ డిమాండ్లను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, వీటిని కొన్నింటిని నెరవేర్చామని, మరికొన్ని సీఎం పరిశీలనలో ఉన్నట్టు వివరించారు. అన్ని డిమాండ్లను సీఎం స్టాలిన్ అమల్లోకి తీసుకొస్తారని భరోసా ఇచ్చారు. పదో తరగతి చదివే సమయంలో తన టీచర్ అంటే చాలా భయం అని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉపాధ్యాయులను చూసే అవకాశం వచ్చినా, ఆ భయం అన్నది ఇంకా అలాగే ఉందని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న వాళ్లంతా సాధారణమైన వాళ్లు కాదని, అందరూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్న వారు కావడం తాను జాగ్రత్తగా మాట్లాడతానని, ఆమేరకు తనకు గురువు అంటే ఎంతో గౌరవం అని వివరించారు. ఈసందర్భంగా ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్, కలైంజ్ఞర్ కరుణానిది గురించి సీఎం స్టాలిన్ సైతం ఒక ఉపాధ్యాయుడిలా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రధానోపాధ్యాయుడైతే తామంతా ఆయన విద్యార్థులం అని గర్వంగా చెప్పుకుంటున్నట్టు తెలిపారు. విద్య ద్వారానే సామాజిక మార్పులు సాధ్యమవుతాయన్నది తమిళనాడులో నిరూపితమైందన్నారు. ఆ మేరకు శక్తివంతంగా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దారన్నారు. నేటి యుగంలో సామాజిక న్యాయాన్ని పెంపొందించాలని, అన్యాయాన్ని వ్యతిరేకించాలని పేర్కొంటూ, ఈ రెండు సూత్రాలను విద్యార్థులకు మరింతగా నేర్పించాలని సూచించారు. రాష్ట్రం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కొత్త జాతీయ విద్యా విధానం గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ ద్విభాషకే చోటు అని స్పష్టం చేశారు. త్రిభాషా విధానాన్ని అనుసరించే ప్రసక్తే లేదని, అంగీకరించబోమన్నారు. గురువులకు అండగా ప్రభుత్వం ఉందని, ఎల్లప్పుడు అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే, క్రీడా మంత్రిగా తాను ఓ అభ్యర్థన పెడుతున్నానని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించే విధంగా తోడ్పాటు అందించాలని కోరారు. డాక్టర్ రాధాకృష్ణన్కు త్వరలో బ్రహ్మాండ విగ్రహం ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ముందుగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేద కళాకారులకు ఆర్థిక సహాయం ఉదయనిధి స్టాలిన్ అందించారు. 2,500 మంది కళాకారులకు నెలకు రూ.3వేలు అదనపు ఆర్థిక సహాయం అన్నది తమిళనాడు ఇయల్ఇసై నాటకమండ్రం ద్వారా అందజేశారు.
గురువులకే మా మద్దతు
గురువులకే మా మద్దతు
గురువులకే మా మద్దతు