
సినిమా చుట్టూ ప్రతికూల పరిస్థితులు
దర్శకుడు శశి, శివ, విజయ్తో
బ్లాక్మెయిల్ చిత్ర యూనిట్
తమిళసినిమా: సినిమా చుట్టూ ప్రతికూల విషయాలు జరుగుతున్నాయని నిర్మాత, పంపిణీదారుడు ధనుంజయన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్మెయిల్. ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని జేడీఎస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జయక్కొడి అమల్రాజ్ నిర్మించారు. నటి తేజూ అశ్విని నాయకిగా నటించిన ఇందులో గిరిజా హరి, రమేష్ తిలర్, ముత్తుకుమార్, లింగా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, గోకుల్ బినాయ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. దీన్ని తమిళనాడులో జి.ధనుంజయన్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రిరిలీజ్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఈ వేదికపై జీవీ ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ యూనిట్ అంతా సిన్సియర్గా పని చేసిన చిత్రం ఇదన్నారు. దర్శకుడు మారన్ మంచి చిత్రాన్ని అందించారన్నారు. తనకు చాలా నచ్చిందన్నారు. అందరినీ ఆకట్టుకునే థ్రిల్లర్ కథా చిత్రంగా బ్లాక్మెయిల్ ఉంటుందని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ జి.ధనుంజయన్ మాట్లాడుతూ కొన్ని కారణాలతో ఈ చిత్ర విడుదల వాయిదా పడిందని, తాను చిత్రం చూసినప్పుడు చాలా నచ్చిందని అన్నారు. చిత్ర కథలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. చిత్రంలో ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎలా కిడ్నాప్ చేస్తారనే పలు లేయర్లు చిత్రంలో ఉంటాయని చెప్పారు. ప్రేక్షకులకు మంచి చిత్రం చూసిన తృప్తి కలుగుతుందన్నారు. ఇకపోతే సినిమా చుట్టూ పలు ప్రతికూల విషయాలు జరుగుతున్నాయన్నారు. చిత్రాలపై దుష్ప్రచారం చేయడానికే ఒక టీమ్ ఏర్పాటు అయ్యిందన్నారు. వాటన్నింటినీ అధిగమించి ఒక చిత్రం విజయం సాధించాల్సి ఉంటోందన్నారు. అందుకే దయ చేసి సినిమాను మిస్ యూజ్ చేయవద్దని అన్నారు. మంచి చిత్రాలను సపోర్టు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దర్శకుడు శశి, విజయ్, టి.శివ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.