
క్లుప్తంగా
కళాశాల విద్యార్థినికి
లైంగిక వేధింపులు
పళ్లిపట్టు: కళాశాల విద్యార్థినికి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని పోలీసులు పోక్సో చట్టంపై అరెస్టు చేశారు. పళ్లిపట్టు పోలీసుల కథనం మేరకు.. కరింబేడు ప్రాంతానికి చెందిన యువతి ఆర్కేపేట ప్రాంతంలోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుకుంటున్నారు. కళాశాల బస్సులో ప్రయాణం చేసి, రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో యథాప్రకారం గురువారం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి నడిచి వెళ్తుండగా యువకుడు అడ్డుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాలిక తల్లిదండ్రుల వద్ద చెప్పుకోగా పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పళ్లిపట్టు ఎస్ఐ రమేష్కుమార్ విచారణలో అరవాసపట్టడె గ్రామానికి చెందిన హేమంత్(27) బీజేపీలో మండల స్థాయిలో ఐటీ వింగ్ విభాగంలో మాజీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
318 మంది పారిశుధ్య
కార్మికులపై కేసు
తిరువొత్తియూరు: చైన్నె మహానగర పాలక సంస్థ పారిశుధ్య పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పారిశుధ్య కార్మికులు నిరసన తెలుపుతున్నారు. చైన్నె కార్పొరేషన్ కార్యాలయం ముందు కొన్ని రోజుల క్రితం జరిగిన నిరసనలో పాల్గొన్న పారిశుధ్య కార్మికులను కోర్టు ఆదేశాల మేరకు బలవంతంగా తొలగించారు. ఆ తర్వాత కూడా తమ డిమాండ్లను పారిశుధ్య కార్మికులు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలోనే చింతాద్రిపేట మే డే పార్కులో గురువారం పారిశుధ్య కార్మికులు ఆకస్మికంగా నిరసన తెలిపారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పారిశుధ్య కార్మికులను బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం అందరినీ కమ్యూనిటీ హాలులో ఉంచి గురువారం రాత్రి విడిచిపెట్టారు. ఈ నిరసన సమయంలో పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో ఒక మహిళా పారిశుధ్య కార్మికురాలికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్రమంగా గుమికూడినందుకు 318 మంది పారిశుధ్య కార్మికులపై చింతాద్రిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కార్మిక హక్కుల సంఘానికి చెందిన పుంజిబాబు, తమిళసెల్వన్, ఆనంద్లపై కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా గుమికూడడంతోపాటు మరో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
ప్లస్ టూ విద్యార్థి
ఆత్మహత్య
తిరువొత్తియూరు: ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసి 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్లస్టూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమంగళం, పార్క్ అవెన్యూ, మెయిన్ రోడ్లోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న బాల్రాజ్, రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఇతని భార్య నర్మద. పొన్నేరిలోని బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్. వారి కుమారుడు ప్రజిత్ (16) అన్నానగర్ పశ్చిమ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు.
గురువారం సాయంత్రం అతను ఎప్పటిలాగే పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ప్రజిత్ హఠాత్తుగా ఇంటి 4వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలైన ప్రజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదిచూసి అపార్ట్మెంట్ వాసులు ప్రజిత్ తల్లిదండ్రులకు, తిరుమంగళం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రజిత్ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ వీడియోలో ‘నేను జీవించడం ఎవరికీ ఇష్టం లేదు. ఎవరూ నన్ను ఇష్టపడరు. కాబట్టి నేను జీవించాలనుకోవడం లేదు. అందరికీ గుడ్బై అని భావోద్వేగంతో మాట్లా డాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్టేటస్గా కూడా పెట్టుకున్నాడు. ఇది చూసి అతని స్నేహితులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పట్టాకత్తి పట్టుకుని
రీల్స్ విడుదల
–వ్యక్తి అరెస్ట్
తిరువొత్తియూరు: పట్టాకత్తి పట్టుకుని రీల్స్ చేసిన కండక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువారూర్ జిల్లా, ముత్తుపేట సమీపంలోని అలంగడు వల్లూవర్ సిల్లా ప్రాంతానికి చెందిన మునుస్వామి కుమారుడు పార్థసారథి (23) మినీ బస్సులో కండక్టర్. గురువారం పార్థసారథి పుట్టినరోజు. దీనికి సంబంధించి, అతను పట్టాకత్తి ఆయుధాలతో ఉన్న ఫొటోలు , రీల్స్ వీడియోలను తన ఫేస్బుక్ సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. దీనిని చూసిన తిరువారూర్ ఎస్పీ కరుణ్ కరట్ ఆదేశాల మేరకు ముత్తుపేట పోలీసులు కేసు నమోదు చేసి పార్థసారథిని, అతనికి పట్టాకత్తిని ఇచ్చిన జాంబవానోడై మేలక్కాటుకు చెందిన శక్తివేల్ కుమారుడు అయ్యప్పన్ (22)లను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి పట్టాకత్తిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరిని తిరుత్తురైపూండి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.