ఇన్స్ట్రాగామ్లో
కొత్త మైక్రోడ్రామా సిరీస్
సాక్షి, చైన్నె: స్నేహం, విచిత్ర వైబ్, నాటకీయ, ఆనందకరమైన క్షణాలతో నిండిన ఇద్దరుస్నేహితుల ప్రయాణాన్ని, జెన్ జెడ్ సృజనాత్మక సాహసాలను ఇన్స్ట్రాగామ్ వేదికగా పార్టీ ఆఫ్ టూ అనే మైక్రో డ్రామా సిరిస్ను విడుదల చేసింది. ఈ వివరాలను బుధవారం స్థానికంగా ప్రకటించారు. డైనమిక్, సినిమాటిక్ ఫార్మాట్లో మొబైల్ ప్రేక్షకుల కోసం 7 ఎపిసోడ్ల సీరియస్ అట్ ఇన్స్ట్రాగామ్, అట్ మెటామీడిలలో ప్రత్యేక ప్రీమియర్ కానున్నట్టు వివరించారు. బుధవారం ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా, 4వ తేదీ నుంచి ప్రతి రోజు ఒక కొత్త ఎపిసోడ్ విడుదల కానున్నట్టు మెటా ప్రతినిధి ప్రకటించారు. ఈ ఎపిసోడ్కు సముద్ర సేన్ గుప్తా, గోపికృష్ణ నాయర్ దర్శకత్వం వహించగా, నిధి భాను శాలి, సునాక్షిగ్రోవర్ వినూత్నమైన కథలో నటించారని వివరించారు.
యాచకుడిపై దాడి
– ఎస్ఐ సహా ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
అన్నానగర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం తిరుచ్చిలోని శ్రీరంగం రంగనాథర్ ఆలయంలో దర్శనానికి రావాల్సి ఉంది. దీంతో శ్రీరంగంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరంగంలోని హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్ నుంచి ఆలయం వరకు ఉన్న మార్గంలో కూడా పోలీసులు భద్రతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంకా, శ్రీరంగం ఆలయం మొత్తాన్ని పోలీసుల నియంత్రణలోకి తీసుకువచ్చారు. ఈ పరిస్థితుల్లో భద్రతా చర్యగా, పోలీసులు మంగళవారం శ్రీరంగం ఆలయ సముదాయంలో ఉంటున్న యాచకులను బయటకు పంపించడానికి యత్నించారు. ఆ సమయంలో ఈరోడ్కు చెందిన 65 ఏళ్ల యాచకుడు వెళ్లడానికి నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగాడని ఆరోపించారు. ఇందులో ఇద్దరు పోలీసులు అతన్ని కొట్టి, తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత పోలీసులు యాచకులను బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. బదులుగా స్వయంగా ఆలయం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దాడికి గురైన యాచకుడు సంవత్సర కాలంగా శ్రీరంగం ఆలయంలో ఉంటున్నాడని తెలుస్తోంది. ఇంతలో, యాచకుడిపై దాడి గురించి తెలుసుకున్న తిరుచ్చి నగర పోలీసు కమిషనర్ గామిని, దాడిలో పాల్గొన్న స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని బుధవారం ఆదేశించారు.
కారు దగ్ధం
– ఆరుగురికి తప్పిన ప్రమాదం
తిరువొత్తియూరు: ఆలందూర్ ప్రాంతంలో జీఎస్టీ రోడ్డులో కారు దగ్ధమైన ఘటనలో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. చైన్నె వేలచ్చేరికి చెందిన డొమినిక్ అమెరికా నుంచి వస్తున్న తన బంధువును తీసుకురావడానికి కారులో మీనంబాక్కం విమానాశ్రయానికి వెళ్లారు. తరువాత, విమానాశ్రయం నుంటి 5 సంవత్సరాల బాలిక 6 నెలల ఆడ శిశువుతో సహా ఆరుగురిని కారులో ఎక్కించుకుని బయలుదేరాడు. ఆలందూర్ జీఎస్టీ రోడ్డు. తిల్లై గంగా నగర్ అండర్పాస్ ద్వారా వేలచ్చేరి వెళ్లడానికి కారును మలుపు తిప్పారు. ఆ సమయంలో కారు ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగడంతో దిగ్భ్రాంతి చెందిన డోమినిక్ వెంటనే కారును ఆపి అందరినీ దించారు. ఆ తర్వాత కారులోని అన్ని భాగాలలో మంటలు వ్యాపించాయి. దీని గురించి సమాచారం అందిన వెంటనే తాంబరం అగ్నిమాపక కేంద్రం నుండి సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినా, కారు అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాసెన్స్ ప్రధాన అధికారిగా స్వర్ణ రాజమణి
సాక్షి, చైన్నె: ప్రముఖ కాంట్రాక్ట్ ఫుడ్ సర్వీసెస్ సంస్థ ప్రధాన వర్తక అధికారిగా స్వర్ణ రాజమణి నియమితులయ్యారు. ఈ మేరకు ఈ సంస్థ బుధవారం స్థానికంగా ప్రకటించింది. ఫుడ్ సర్వీసెస్ భవిష్యత్తును రూపకల్పన చేయడంలో ఆమె కీలక పాత్రను పోషించనున్నారని, సాంకేతికతపై వ్యూహాత్మక చొరవలకు నాయకత్వం వహిస్తారని వివరించారు. అతిచిన్న వయస్కురాలిగా తొలి మహిళా బోర్డు సభ్యురాలుగా ఆమె గుర్తింపును దక్కించుకున్నట్టు పేర్కొన్నారు. ఇది వరకు స్పార్క్ క్యాపిటల్ ఏఐఎఫ్ నిధుల సేకరణ ద్వారా సీఆర్సీఎల్ఎల్ఎల్పీ రాసెన్స్ పునర్నిర్మించడంలో పాల్గొని ఉన్నారని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ పుడ్ సర్వీసులో తొలి ఏఐఎఫ్ పెట్టుబడిని స్వీకరించే బాధ్యత, ఆహార సేవల పరిశ్రమలో స్వర్ణ 8 సంవత్సరాలకు పైగా పనిచేశారని వివరించారు.
నేడు ఆర్ఎంకే కళాశాలలో ప్రషర్స్డే
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్ఎంకే కళాశాలలో నేడు( గురువారం) ఆర్ఎంకే, ఆర్ఎండి ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు పొందిన బిఈ, బీటెక్, ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థులను ఆహ్వానించే కార్యక్రమం జరగనున్నట్టు కళాశాల ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ మునిరత్నం తెలిపారు. ఈ కార్యక్రమం కళాశాల ఆవరణంలోని ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జరగనుంది. కార్యక్రమానికి చేర్మన్ ఆర్ఎస్ మునిరత్నం అద్యక్షత వహించనున్నారు. ముఖ్యఅతిధిగా ప్రముఖ సలహదారుడు జయప్రకాష్ గాంధీ హాజరుకానుండగా కళాశాల ఉపాధ్యాక్షుడు ఆర్ఎం కిషోర్, కార్యదర్శి యలమంచి ప్రధీప్, కళాశాల సలహాదారులు మనోహరన్, విశ్రాంత ఐఏఎస్ పిచ్చాండి, పళణిస్వామి మొదటి సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరుకానున్నారు.