
కొత్త బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి శివశంకర్
సాక్షి, చైన్నె: ఈ ఏడాది చివరి నాటికి కిలాంబాక్కంలో రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేస్తామని సీఎండీఏ ఛైర్మన్, హిందూ దేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు తెలిపారు. దేవదాయశాఖలో టీఎన్పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన 60 పోస్టులకు ఉద్యోగ నియామకాలను మంగళవారం మంత్రి అందజేశారు. అనంతరం కిలాంబాక్కంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు విషయంగా అధికారులతో చర్చించారు. కిలాంబాక్కం బస్టాండ్ నుంచి పూర్తిస్థాయిలో మంగళవారం నుంచి బస్సుల సేవలు మొదలైన విషయాన్ని ఈసందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ఈ బస్టాండ్కు ఎదురుగా ఉరపాక్కం – వండలూరు ఎలక్ట్రిక్ రైల్వే సేషన్ల మధ్యలో కిలాంబాక్కం రైల్వే స్టేషన్ ఏర్పాటుకు చర్య లు తీసుకున్నామన్నారు. ఈ పనుల కోసం సీఎండీఏ నేతృత్వంలో రూ. 20 కోట్లను దక్షిణ రైల్వేకు అందజేశామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ రైల్వే స్టేషన్ పనులు ముగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. బస్టాండ్కు రైల్వే స్టేషన్కు మధ్యలో జాతీయ రహదారి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, నేరుగా ప్రయాణికులు బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు వీలుగా రూ. 120 కోట్లతో స్కైవాక్ పాదచారుల వంతెన నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు.
స్తంభించిన రహదారి..
కిలాంబాక్కం బస్టాండ్ మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఉపయోగంలోకి వచ్చింది. ఆమ్నీ ప్రైవేటు బస్సులు, ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు ఈ బస్టాండ్కే పరిమితమయ్యాయి. దక్షిణ తమిళనాడులోని అన్ని నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు ఇక్కడి నుంచే బస్సుల రాకపోకలు సాగించాయి. దీంతో తొలి రోజున జాతీయ రహదారిలో కిలాంబాక్కం నుంచి గూడువాంజేరి మీదుగా మరైమలై నగర్ వరకు ట్రాఫిక్ రద్దీ నెలకొంది. కిలాంబాక్కం నుంచి రోజుకు దక్షిణ తమిళనాడు వైపుగా 710 ఎక్స్ప్రెస్ బస్సులు రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఉత్తర చైన్నె పరిసరాలలోని ప్రజలు కిలాంబాక్కంకు వెళ్లేందుకు వీలుగా తాంబరం వైపుగా ఐదు నిమిషాలకు ఓ బస్సునడిపేందుకు ఏర్పాట్లు చేశారు. మాధవరం నుంచి తిరుపతికి తమిళనాడు బస్సుల సేవలు, అలాగే, మరికొన్ని ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ బస్సులను మాధవరం బస్టాండ్లో రవాణశాఖ మంత్రి శివశంకర్జెండా ఊపి ప్రారంభించారు.

ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేస్తున్న మంత్రి శేఖర్ బాబు