
తల్లి విగ్రహం వద్ద తల్లి మణితో ప్రభు
● తల్లి ప్రేమను చాటుకున్న తనయుడు
తిరువొత్తియూరు: నవమాసాలు కడుపున మోసి, కని, పెంచి ప్రయోజకులను చేసే తల్లిదండ్రులను ప్రేమించడం, వారు చనిపోతే పిల్లలు వారికి విగ్రహాలు నిర్మించి పూజించడం సహజమే. నామక్కల్ జిల్లాలో తల్లి జీవించి ఉండగానే ఆమెకు విగ్రహం తయారుచేసి ఆలయం నిర్మించి తల్లి ప్రేమను చాటుకున్నాడు ఓ తనయుడు. నామక్కల్ సమీపంలో ఉన్న రెడ్డిపట్టి శక్తి నగర్ ప్రాంతానికి చెందిన ప్రభు (30) వెల్డింగ్ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి తల్లి మణి (54), దీప అనే సహోదరి ఉన్నారు. ప్రభు చిన్నతనంలోనే తండ్రి వాసు మృతి చెందాడు. ఈ క్రమంలో చాలా కష్టాలు పడి పిల్లలను పెంచి పెద్ద చేసినందుకు తనయుడు తల్లిపై మమకారం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రభు ఇంటికి సమీపంలోనే 1200 చదరపు అడుగుల స్థలంలో ఆలయం నిర్మించి అందులో 3 అడుగుల ఎత్తులో తల్లి రూపాన్ని విగ్రహంగా తయారు చేసి ఉంచాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. తల్లి ప్రేమను చాటుకున్న ప్రభును పలువురు అభినందిస్తున్నారు.