
ఒప్పందం చేసుకుంటున్న బ్యాంకు అధికారులు
కొరుక్కుపేట: వివాహంలో నూతన వధూవరులను ఆశీర్వదించే వారికి తాంబూలం ఇవ్వడం సర్వసాధారణం. తాంబూలంలో ఆకు వక్కపొలుకులు, డబ్బున్న వారు వెండి పళ్లెం, కొత్త వస్తువులు అందజేస్తారు. పుదుచ్చేరిలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్లో తాంబూలంలో కొబ్బరికాయ, పండ్లు, తెల్లబెల్లం, కొబ్బరి, క్వార్టర్ మందుబాటిల్ అందజేయడం ఆసక్తి కలిగించింది. వివాహ రిసెప్షన్కు హాజరైన వధూవరుల బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వింత సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
రూ.63లక్షల
బంగారం పట్టివేత
తిరువొత్తియూరు: చైన్నె విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన రూ.63 లక్షల విలువ గల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. చైన్నె విమానాశ్రయంలో గురువారం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక యువకుడి వద్ద తనిఖీ చేయగా కంప్యూటర్ భాగాలలో బంగారం తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో అతని వద్ద నుంచి రూ.63 లక్షల 7వేలు విలువ కలిగిన కిలో 165 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఐసీసీఎల్తో ఇండియన్
బ్యాంకు ఒప్పందం
కొరుక్కుపేట: బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేందుకు వీలుగా ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐసీసీఎల్)తో ఇండియన్ బ్యాంకు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇండియన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేష్ కుమార్ బజాజ్, ఐసీసీఎల్ సంస్థ సీఈఓ దేవికాషాతో బ్యాంకు ఎంప్యానెల్మెంట్ను లాంచన ప్రాయంగా చేయడానికి ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.
బాయిలర్ పేలి కార్మికుడు మృతి
తిరువొత్తియూరు: వందలూరు సమీపంలోని ఓ కర్మాగారంలో భారీ బాయిలర్ పేలడంతో కార్మికుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చెంగల్పట్టు జిల్లా వండలూరు సమీపంలో వున్న కీరపాక్కం పంచాయతీకి చెందిన వినాయకపురం ప్రాంతంలో సిమెంటు రాళ్లు తయారీ ప్రైవేటు కర్మాగారం ఉంది. బుధవారం రాత్రి సిమెంటు రాళ్లను తయారీ పనిలో నిమగ్నమై ఉండగా ఆ సమయంలో ఓ భారీ బాయిలర్ పేలింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన బీరజ్ (18) మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన హైక్లత్ (25), విల్లుపురానికి చెందిన యువరాజ్ (25)కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిద్దరిని రత్నమంగళంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మందుబాటిల్తో కూడిన తాంబూలం అందజేస్తున్న పెళ్లివారు