మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కొంత ముందుగా చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్షేత్రంలోని రాజగోపురం నుంచి ఆలయంలోని ముఖమండపం, గర్భాలయం వరకు.. అదేవిధంగా శ్రీపార్వతీ రామలింగేశ్వరాలయంలో పూజలు చేసుకునే భక్తులకు అసౌకర్యం కలగకుండా పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.


