శాలిగౌరారం : మండలంలోని ఊట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన స్థలాన్ని విక్రయించేందుకు సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఉప సర్పంచ్ రంగు రాములు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అర్ధనగ్నంగా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది వార్డు సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ శీలం అనితాశంకర్ కుమ్మకై ్క గ్రామ పంచాయతీకి చెందిన 363 చదరపు గజాల స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థలాన్ని విక్రయించొద్దని, ఇతర అవసరాలకు వినియోగించాలని చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయమై సర్పంచ్ శీలం అనితాశంకర్ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీ స్థలాన్ని అమ్మేందుకు తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఉప సర్పంచ్ రాములు దురుద్దేశంతో, రాజకీయ ఆధిపత్యం కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్లు ఇద్దరూ అధికార పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.
అర్ధనగ్నంగా ఉప సర్పంచ్ నిరసన


