
గీతకార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం
సూర్యాపేట అర్బన్ : గీతకార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవింద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో సూర్యాపేటలో కల్లుగీత కార్మిక సంఘం 4 వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటిరోజు వేలాదిమంది గీత కార్మికులతో ప్రదర్శన, బహిరంగ సభ, మిగతా రెండు రోజులు ప్రతినిధుల సభ నిర్వహిస్తామని వివరించారు. గీతవృత్తిని ఆధారంగా చేసుకొని జీవనంసాగిస్తున్న కార్మికుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదన్నారు. ప్రభుత్వాలు సహకరించి తాటి, ఈత చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలని కోరారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని అందుకు తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. గీతకార్మికులకు పింఛన్ రూ4 వేలకు, ఎక్సిగ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాద నివారణకు కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలన్నారు. ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా రూ. 12 కోట్ల 60 లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.వెంకట నరసయ్య, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, కార్యదర్శి ఎస్.రమేష్ గౌడ్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు గౌడ్, కొండం కరుణాకర్, యమ గాని వెంకన్న, అబ్బగాని భిక్షం తదితరులు పాల్గొన్నారు.
ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ