
50 శాతం ప్లాంటేషన్ పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఈ నెల చివరికల్లా 50 శాతం ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవ లక్ష్యాలను విజయవంతంగా అధిగమించాలన్నారు. జూలై చివరి కల్లా ఫిట్టింగ్ 75 శాతం పూర్తి చేయాలని, మొక్కలు నాటే కార్యక్రమం 50 శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, వర్షపు నీరు ఒడిసిపట్టే ఇంకుడు గుంటలు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ ఇంకుడు గుంతలు ఈనెల చివరి కల్లా పూర్తి చేయాలని తెలిపారు. ఈనెల చివరి వారంలో పూర్తిచేసిన పనులన్నింటినీ పీపీటీ ద్వారా వివరించాలని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
లింగనిర్ధారణ
పరీక్షలు చేస్తే చర్యలు
నేరేడుచర్ల : లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ జయ మనోహరి హెచ్చరించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు సమాచారం అందించాలన్నారు. బుధవారం నేరేడుచర్ల మండల కేంద్రంలోని మాధవ నర్సింగ్ హోంను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ చేయని స్కానింగ్ మిషన్ను గుర్తించి, గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ మిషన్ వాడకూడదన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ సెంటర్ నడిపితే మూసివేస్తామన్నారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నజియా, టీవీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలంతో పాటు అధికారుల బృందం తదితరులున్నారు.
ప్రవేశాలు పెంచాలి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ డిప్యూటీ సెక్రటరీ భీమ్ సింగ్ అన్నారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో అడ్మిషన్లు భారీగా పెరిగాయని తెలిపారు. నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా 154 అడ్మిషన్లు అయ్యాయని, ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మారం హరిప్రసాద్, తుంగతుర్తి కళాశాల ప్రిన్సిపాల్ రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు.

50 శాతం ప్లాంటేషన్ పూర్తిచేయాలి