
బియ్యం నాణ్యత తగ్గకుండా చూడాలి
హుజూర్నగర్ : మిల్లర్లు ధాన్యం మరఆడించే సమయంలో బియ్యం నాణ్యత తగ్గకుండా ఉండేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు సూచించారు. మంగళవారం హుజూర్నగర్లోని శృతి, శ్రీదేవి రైస్ ఇండస్ట్రీస్లను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మిల్లులకు వచ్చిన లారీలను ఎక్కువ సమయం నిలిపి ఉంచవద్దని, వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని వెంటనే దిగుమతి చేసుకొని లారీలను తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని ఆయన చెప్పారు. మిల్లర్లు ధాన్యం మర ఆడించేటప్పుడు బియ్యం నాణ్యత తగ్గకుండా ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం పట్టణంలోని గుట్టకు వెళ్లేదారిలో ఏర్పాటు చేసిన వెంచర్, రికార్డులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ నాగార్జున రెడ్డి, డీటీ నాగేందర్, ఆర్ఐ లు ప్రమోద్, పాషా పాల్గొన్నారు.