ఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలు

May 31 2025 1:10 AM | Updated on May 31 2025 1:10 AM

ఆగని

ఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలు

కోదాడ: కోదాడ పట్టణానికి సమీపంలో రామిరెడ్డిపాలెం వద్ద ఉన్న అనంతగిరి రంగనాథస్వామి దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమించడానికి కొందరు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కొమరబండకు చెందిన నాటి అధికార పార్టీ నేత ఒకరు ఈ భూమి ఆక్రమణకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకొనగా ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో సంబంధిత అధికారులు సైతం ఆక్రమణను అడ్డుకున్నారు. తాజాగా శుక్రవారం అదే స్థలాన్ని మరో నేత ఆక్రమించడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు.

అసలు విషయం ఏమిటంటే..

కోదాడ పట్టణ సమీపంలోని రామిరెడ్డిపాలెం రోడ్డులో అనంతగిరి గ్రామానికి చెందిన రంగనాథస్వామి దేవాలయానికి సర్వే నంబర్‌ 1024, 1025లో అత్యంత విలువైన 24 ఎకరాల భూమి ఉంది. దేవాలయ ధూపదీప నైవేద్యాల కోసం భక్తులు దీన్ని ఆలయానికి ఇచ్చారు. ఈ భూమిలో దాదాపు 20 ఏళ్ల క్రితం పేదలకు ఇందిరమ్మ ఇళ్లకోసం 5 ఎకరాలను ప్రభుత్వం తీసుకొని వారికి ఇళ్లను కట్టించింది. మిగిలిన భూమిని కొందరు రైతులు కౌలుకు చేసుకుంటూ దేవాలయానికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 30–05–2023న నాటి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేత కాలనీకి ఆనుకొని ఉన్న ఆలయానికి చెందిన ఖాళీ స్థలాన్ని మట్టితో నింపి చదును చేసి ఆక్రమణకు ప్రయత్నించారు. దీన్ని రామిరెడ్డిపాలెం వాసులు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రత్యేక కధనంతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆక్రమణ ఆగిపోయింది. తాజాగా శుక్రవారం అధికారపార్టీకి చెందిన నేత ఒకరు ఈ స్థలాన్ని ఆక్రమించడానికి జేసీబీతో చదును చేయసాగారు. మట్టికూడా పోస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఆదేశించినా..

అనంతగిరి దేవాలయ భూమి ఆక్రమణకు గురువుతుందని, దీన్ని కాపాడాలని నాలుగు నెలల క్రితం అనంతగిరికి వచ్చిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించి ఎమ్మెల్యే పక్కనే ఉన్న కోదాడ ఆర్డీఓను పిలిచి సదరు దేవాలయ భూములను సర్వే చేసి చుట్టూ పెన్సింగ్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐనప్పటికీ రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆక్రమణలు మళ్లీ జోరందుకున్నాయి. ఇక్కడ ఎకరం భూమి విలువ కోటి రూపాయలు ఉంటుందని రామిరెడ్డిపాలెం గ్రామస్తులు అంటున్నారు.

ఆక్రమణలను అడ్డుకోవాలి

మా గ్రామ దేవాలయానికి చెందిన భూములు ఆక్రమణకు గురువుతున్నాయి. దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాము. సర్వే చేసి చుట్టూ పెన్సింగ్‌ ఏర్పాటు చేయమని ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో మళ్లీ కొందరు అదే భూమిని ఆక్రమించేందుకు చూస్తున్నారు. ఇప్పటికై నా ఆక్రమణలను అడ్డుకుని స్థలాన్ని సర్వే చేసి చుట్టూ పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి.

– ఈదుల కృష్ణయ్య, న్యాయవాది, అనంతగిరి

ఫ అనంతగిరి రంగనాథస్వామి ఆలయ

భూములపై కన్నేసిన అక్రమార్కులు

ఫ ఓ నేత కబ్జా చేయాలని చూస్తే గతంలోనే

అడ్డుకున్న రామిరెడ్డిపాలెం వాసులు

ఫ వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’

ఫ అదే స్థలాన్ని మళ్లీ ఆక్రమించేందుకు

చూస్తున్న మరో నాయకుడు

ఫ రెండో సారి అధికారులకు

ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

ఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలు1
1/1

ఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement