
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు శాఖల వారీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తుకు కచ్చితమైన సమాధానం తెలియజేయాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసంపై సూచనలను అనుసరించి జిల్లాస్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. మండలాలకు కేటాయించిన ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోజువారీగా, వారం వారీగా, పక్షం రోజుల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వస్తున్నందున స్వచ్ఛదనం –పచ్చదనంలో భాగంగా వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజావాణిలో 79 దరఖాస్తులు వచ్చాయని, అర్జీలను పరిష్కారం కోసం అధికారులకు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీడబ్ల్యూ ఓ నరసింహారావు, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీనివాసరాజు, శ్రీలత రెడ్డి, వినోద్కుమార్, అధికారులు పాల్గొన్నారు.