
ఆరు రోజులు.. పదకొండు గ్రామాలు
గరిడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పథకం కింద సూర్యాపేట జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలం ఎంపికై ంది. కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు మండలంలోని సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారుల బృందం గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించనున్నారు. మండలంలో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి భూ భారతి కార్యక్రమం ద్వారా పరిష్కారమయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభించనుంది. అధికారులు వారి స్థాయిని బట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. మండలం పూర్తిగా ఆయకట్టు మండలం కావటం బోర్లు, బావులు, చెరువులు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా వరి సాగవుతుంది. దీంతో మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లాలో గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ధరణి చట్టం ద్వారా ఇబ్బందులు పడ్డ రైతులు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం ద్వారా పూర్తి సమస్యలు పరిష్కారం కానున్నట్లు అధికారులు తెలిపారు. సాదాబైనామాల పరిష్కారం 13బీ అసైన్డ్ భూములు వారసత్వ భూములు వికేంద్రీకరణ బ్లాక్ల విభజనతో పాటు ఇతర భూ సమస్యలు పరిష్కారం కానుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి గరిడేపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు
భూ భారతి పైలెట్ మండలంగా ఎంపిక
12 వరకు కొనసాగనున్న సదస్సులు
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఈ నెల 5 నుంచి 12 వరకు జరిగే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి రైతు హాజరై దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలి.
– బండ కవిత, తహసీల్దార్, గరిడేపల్లి
గ్రామసభల షెడ్యూల్ ఇలా..
గరిడేపల్లి మండల వ్యాప్తంగా ఈ నెల 5 తేదీ నుంచి 12వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహించనున్నారు. తహసీల్దార్, డీఏఓ టీమ్ లీడర్లుగా 20మంది సభ్యులతో రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా ప్రతిరోజు 9గంటల నుంచి 5గంటల వరకు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈమేరకు వారి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేసి సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ నెల 5న తాళ్లమల్కాపురం, రాయినిగూడెం, 6న కాల్వపల్లి, గడ్డిపల్లి, 7న గరిడేపల్లి, కుత్భుషాపురం, 8న గానుగబండ, వెలిదండ, 9న పొనుగోడు, సర్వారం, 12న కల్మ లచెరువు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.

ఆరు రోజులు.. పదకొండు గ్రామాలు