జిల్లాలో భూగర్భ జలవనరులు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో భూగర్భ జల కేంద్రబోర్డు నీటిపారుదల, వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భూగర్భ జల అభివృద్ధి, నిర్వహణ విధానాలపై టైర్ – 3లో భాగంగా టీఏ, టీసీలకు భూగర్భజల కేంద్రబోర్డు ప్రాంతీయ సంచాలకుడు జి.కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భజలాల వనరులను పెంచడానికి, వాననీటిని సంరక్షించడానికి ఇంకుడు గుంతలు, చెక్డ్యామ్లు, రీచార్జి స్ట్రక్చర్స్ నిర్మించాలన్నారు. నరేగా కింద వాటర్ రీచార్జ్ స్ట్రక్చర్లు, ఇంకుడు గుంతలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో కృష్ణా, మూసీ నదుల ప్రవాహం, నాగార్జున సాగర్, ఎస్సారెస్పీల ద్వారా సాగునీరు, తాగునీటి లభ్యత ఉన్నా గ్రౌండ్వాటర్ చాలా మండలాల్లో తగ్గిపోతోందని అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని కొన్నిమండలాల్లో భూపొరల్లో మార్పులు, బండల కారణంగా నీరుభూమిలోకి ఇంకడం లేదన్నారు. అలాంటి చోట్ల వీలైనన్ని చెక్డ్యాంలు, రీచార్జి స్ట్రక్చర్లు కట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సీనియర్ సైంటిస్టులు డాక్టర్ ఎస్ఎస్ విఠల్, టి.రాజబాబులు సూర్యాపేట జిల్లా ఆక్విఫర్ మ్యాపింగ్, నిర్వహణ ప్రణాళికలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ వి.వి అప్పారావు, జిల్లా భూగర్భ జల అధికారి బాలు, భూగర్భ జలబోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.