యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు శ్రీస్వామి అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఆలయంలో ఉదయం శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
108 కలశాలతో..
ఈ నెల 1న స్వస్తి వాచనంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయ ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అంతకు ముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచార్యులకు, పారాయణీకులకు, అధికారులకు, సిబ్బందికి సన్మానించారు. నిత్యారాధనల అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాల సంకీర్తన గావించారు.
ఫ యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు
వైభవంగా ముగింపు పలికిన అర్చకులు
అష్టోత్తర శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
అష్టోత్తర శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం