
నేడు గోదావరి జలాల పునరుద్ధరణ
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాకు వారబందీ విధానంలో ఆదివారం గోదావరి జలాలను పునరుద్ధరించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు గోదావరి జలాలు రానున్నాయని నీటి పారుదల శాఖ డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.
పోలీస్ స్టేషన్లకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలు
సూర్యాపేట టౌన్: ఈనెల 5వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఏ, బీ రెండు సెట్ల ప్రశ్నపత్రాలు శనివారం సూర్యాపేటలోని జిల్లా బల్క్ కేంద్రం నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రశ్న పత్రాలను కస్టోడియన్లు బాల్తు శ్రీనివాస్, మేడ నిరంజన్రెడ్డి, కర్నాటి శ్రీనివాసులు స్వాధీనం చేసుకొని పట్టణంలోని 13 సెంటర్లకు సంబంధించిన సీఎస్, డీఓల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో తేదీల వారీగా భద్రపరిచారు. వీటి పర్యవేక్షణకు వచ్చిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) భానునాయక్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, డాక్టర్ మద్దిమడుగు సైదులు, కేఎల్ నరసింహారావు, కృష్ణ, యాదగిరి, పుల్లయ్య, నరసింహారావు, ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా కొరత లేదు
హుజూర్నగర్ రూరల్: జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) శ్రీధర్రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ పట్టణంతోపాటు మండలంలోని వేపలసింగారం, అమరవరం గ్రామాల్లో పీఏసీఎస్ గోదాం, ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,682 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ తెప్పించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అందుబాటు ఉంచామన్నారు. అంతేకాకుండా రైతులు చివరగా వేసే యూరియాతో పాటు పొటాష్ కలిపి పిచికారీ చేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయన్నారు. ఆయన వెంట ఏఓ రావిరాల స్వర్ణ, సిబ్బంది ఉన్నారు.
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యారాధనలు కొనసాగాయి. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ తంతు పూర్తి చేసి ఉత్సవమూర్తులను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.

నేడు గోదావరి జలాల పునరుద్ధరణ

నేడు గోదావరి జలాల పునరుద్ధరణ