పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..! | - | Sakshi
Sakshi News home page

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!

Oct 24 2025 2:48 AM | Updated on Oct 24 2025 2:48 AM

పట్టు

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..! నిఘా పెట్టాం

సామాన్యులే బాధితులు..

జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణా

అమాయకులకు కమీషన్‌ ఎరగా వేస్తున్న ముఠాలు

పట్టుబడని అసలు సూత్రధారులు

గంజాయి రవాణాపై నిఘా పెట్టాం. సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాం. ఈ విషయంలో సర్కిల్‌ పరిధిలో అన్ని పోలీస్‌స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. గంజాయి రవాణా తీవ్ర నేరం. ఈ విషయంలో ఎవరూ ట్రాప్‌లో పడొద్దు. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

–ఎన్‌.సన్యాసినాయుడు, సీఐ, పాతపట్నం

హిరమండలం:

సెప్టెంబర్‌ 4న కొజ్జిరియా జంక్షన్‌ వద్ద కవిటి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాకు చెందిన సాగర్‌ బెహరా 21.30 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు.

●సెప్టెంబర్‌ 22న ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో అజయ్‌ అనే వ్యక్తి 15 కిలోల గంజాయితో పట్టుబడ్డా డు. తమిళనాడుకు చెందిన విజయ్‌ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

●సెప్టెంబర్‌ 26న పలాస రైల్వేస్టేషన్‌లో తమిళనా డు రాష్ట్రం తూత్‌కుడికి చెందిన మారిష్‌ 14 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. రాయగడ ప్రాంతానికి చెందిన రాహుల్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసి రవాణా క్రమంలో పలాస రైల్వేస్టేషన్‌లో దొరికిపోయాడు.

●ఈ నెల 8న పలాస రైల్వేస్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న కర్ణాటకకు చెందిన సాకత్‌ ఆలీ పట్టుబడ్డా డు. బరంపురంలో గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా 3 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు.

ఒడిశాలో సాగవుతున్న గంజాయి మన జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ప్రధానంగా ఇచ్ఛాపురం, పలాస రైల్వేస్టేషన్ల వరకు బస్సులు, ఇతర వాహనాల ద్వారా గంజాయి తీసుకొస్తున్న అక్రమ రవాణాదారులు అక్కడి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. మొత్తానికి గంజాయి అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. గంజా యి మూలాలన్నీ ఒడిశా వైపే ఉన్నా రవాణాకు మన జిల్లానే వినియోగిస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన వారి విషయంలో పోలీస్‌ నిఘా ఉంది. తనిఖీల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే పట్టుబడుతున్నారు. కొందరు నేరుగా ఒడిశాకు వెళ్లి సరుకు తీసుకెళ్లే క్రమంలో పట్టుబడతుండగా.. మరికొందరు రవాణాకు రూ.5 వేల వంతున కమీషన్‌ తీ సుకొని తరలిస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు.

ఒడిశా నుంచి అధికం..

జిల్లాకు ఆనుకొని ఎక్కువగా ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఒడిశాలో ని జయపురం, రాయగడ, గుడారి, గుణుపూర్‌, గుమ్మ, శరంగో, చంద్రగిరి, దిగపొండి, మోహన, ఆర్‌.ఉదయగిరి తదితర ప్రాంతాల్లో గంజాయి ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గంజా యి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, నౌపడ, శ్రీకాకుళం రోడ్డు మీదుగా కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, తెలంగాణ, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

గంజాయి మాఫియాలో సామాన్యులే ఎక్కువ గా సమిధులుగా మారుతున్నారు. అమాయక గిరిజనులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఇటీవల పలాస రైల్వేస్టేషన్‌లో మహిళలు పట్టుబడ్డారు. వారు బీహార్‌లో హోటల్‌లో పనిచేసే వారు కావడం గమనార్హం. రూ.5 వేలు వరకూ కమీషన్‌ అందిస్తామని చెప్పడంతో వారంతా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి పలాస రైల్వేస్టేషన్‌ నుంచి తరలించే క్రమంలో పట్టుబడ్డారు. మాఫియాకు కారణమైన అసలు సూత్రధారులు మాత్రం పట్టుబడటం లేదు. అవసరాలను, కుటుంబ పరిస్థితులను ఎరగా వేసుకొని ముగ్గులోకి దించుతూ బంగారు భవిష్యత్‌ను పాడుచేస్తున్నారు.

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!1
1/3

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!2
2/3

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!3
3/3

పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement