
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇద్దరికి చోటు
సభ్యులుగా గొండు కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాస్ నియామకం వైఎస్సార్ సీపీలో అందించిన సేవలకు గుర్తింపు ఇద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జిల్లా నుంచి ఇద్దరికి చోటు లభించింది. పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా గొండు కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాసరావులను నియమిస్తూ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్న వారే. వారి కుటుంబీకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా పనిచేశారు. తమ నియామకం పట్ల అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్లకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామని చెప్పారు.
సీనియర్గా గొండుకు గుర్తింపు..
గొండు కృష్ణమూర్తి వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పార్టీ పట్ల విధేయతతో ఉంటూ తన వంతు సేవలు అందిస్తున్నారు. మూడు సార్లు డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. అంతకుముందు అంపోలు పీఏసీఎస్ అధ్యక్షుడిగా మూడు సార్లు సేవలందించారు. భార్య సౌధామణి అంపోలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. కృష్ణమూర్తి తండ్రి గొండు నర్సింగరావు ఎమ్మెల్సీగా, సమితి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా నియోజకవర్గంలో పేరుంది.
చల్లాకు స్టేట్ పదవి..
జిల్లాలో మరో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన చల్లా శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉంది. ఈయన తాత, తండ్రులిద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తాత చల్లా నర్సింహనాయుడు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సేవలందించారు. శ్రీనివాసరావు తండ్రి చల్లా లక్ష్మీణారాయణ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీనివాసరావు భార్య ఆలివేలు మంగా జెడ్పీ ప్లానింగ్ కమిషన్ మెంబర్గా, మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు.

స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇద్దరికి చోటు