
పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?
జలుమూరు: పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం అందవరం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. అందవరం, రామకృష్ణాపురం, గొల్లపేట గ్రామాల్లో రోడ్డుపైనే మురుగునీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దోమలు వ్యాప్తి చెంది అంటురోగాల బారినపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు కూడా వెలగడం లేదని, ఇసుక లారీల వల్ల రోడ్డు గోతులమయంగా మారిందని వాపోయారు. విషయం తెలుసుకున్న పంచాయతీ విస్తరణ అధికారి ఉమామహేశ్వరరావు గ్రామస్తులతో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.
గంజాయితో ఇద్దరి అరెస్టు
పలాస: ఒడిశా రాష్ట్రం జగిదిపదర్ గ్రామానికి చెందిన హేమంత్ సబర్, కేశబ్సబర్లు పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో మంగళవారం అనుమానాస్పదంగా తిరగడంతో పట్టుకొని తనిఖీ చేయగా గంజాయి బయటపడిందని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. మూడు ప్యాకెట్లలో ఉన్న 16.845 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నిందితులను పలాస కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. ఒడిశా రాష్ట్రం రాజ్బోసా గ్రామానికి చెందిన అముస్ అలియాస్ జూన్హేన్సన్ వద్ద గంజాయి తీసుకుని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంజురైతో అనే వ్యక్తికి ఇచ్చేందుకు వీరు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. పలాస రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని కాశీబుగ్గ ఎస్ఐ ఆర్.నరసింహమూర్తి సిబ్బందితో కలిసి పట్టుకున్నారని సీఐ చెప్పారు. గంజాయితో పాటు సెల్ఫోన్, రూ.3,650 నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
24న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
వజ్రపుకొత్తూరు రూరల్: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డోకులపాడులో ఈ నెల 24న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు అర్హులని, ఈ నెల 22లోగా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 9550190937 నంబర్ను సంప్రదించాలని కోరారు.

పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?