
సాంకేతిక రంగంలో నైపుణ్యం పెంచుకోవాలి
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల్లో భాగంగా విద్యార్థులతో పాటు అధ్యాపకులు మరింత నైపుణ్యత పెంచుకోవాలని ప్రముఖ కంప్యూటర్ విభాగం సంస్థ క్వాంటమ్ కంప్యూటింగ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష ప్రియదర్శి పేర్కొన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలతో శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో సాంకేతిక రంగంలో అత్యంత ఆధునీకరణ సామర్థ్యం పొందిన తమ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం వలన కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల పురోగతికి మేలు జరుగుతుందన్నారు. క్వాంటం టెక్నాలజీలో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు, సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొడక్ట్ లీడర్ ఎం.చంద్రమౌళి, కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకుడు బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
తక్షణమే ఐఆర్ ప్రకటించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హమీ మేరకు తక్షణమే ఐఆర్ను ప్రకటించాలని ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కె.ప్రవల్లికా ప్రియ అన్నారు. ఏపీ జేఏసీ మహిళా విభాగం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ వసతి గృహం సమావేశ మందిరంలో అవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైల్డ్ కేర్ లీవ్లు కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్చరాలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఆరు నెలలు మాత్రమే ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండేళ్ల పాటు సెలవు ఇవ్వాలని కోరారు. అలాగే తమకు రావాల్సిన నాలుగు డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల పే స్లిప్పులు సకాలంలో వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, సీపీఎస్ను రద్దు చేయాలన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ కె.శ్రీరాములు, ఏపీ జేఏసీ కార్యదర్శి వెంకట రమణ, జి.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల హక్కులను పరిరక్షించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా స్పష్టం చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు భవనంలో జువైనెల్ జస్టిస్ – పిల్లల రక్షణ చట్టాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల హక్కుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, శ్రీకాకుళం కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపాల్ మేజిస్ట్రేట్ (జువైనెల్ జస్టిస్ బోర్డు) కేఎం జమ్రుత్ బేగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ యు.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక రంగంలో నైపుణ్యం పెంచుకోవాలి

సాంకేతిక రంగంలో నైపుణ్యం పెంచుకోవాలి