
పొట్టకొట్టొద్దు..!
తరతరాలుగా జీవిస్తున్నాం
డిపోను నమ్ముకుని మూడు తరాలుగా జీవనం కొనసాగిస్తున్నాం. డిపో విడదీస్తే కూలీ సగానికి పడిపోతుంది. ఇక్కడ సొంత భూములను డిపో కోసం ఇచ్చాం. పది పైసలు కూలీ నుంచి ఇక్కడ మూడు తరాలుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మా ఉపాధి దెబ్బతీయడం అన్యాయం.
– నిడిగింట్ల రమణ, కార్మికుడు
జీవితాలతో ఆటలా..
ఇక్కడ ఎన్నో ప్రమాదాలకోర్చి పనులు చేపడుతున్నాం. నమ్ముకుని 350 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఎటువంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించదు. మా డబ్బులతో మేమే బాగుచేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి జీవోలను జారీ చేసి మా బతుకులతో ఆడుకోవద్దు.
– లండ, సీతారాం, కార్మికుడు
ఎవరడిగారు?
జిల్లా నుంచి 232 షాపులు, బార్లు నుంచి మద్యం తీసుకువెళ్లేందుకు వస్తుంటారు. ఏ షాపువారు కూడా తాము ఇబ్బందులు పడుతున్నాం.. రెండో డిపో కావాలని కోరడం లేదు. ఇక్కడ సౌకర్యంగా ఉన్నప్పుడు మరో డిపోను ఏర్పాటుచేసి కార్మికుల పొట్టకొట్టడం అన్యాయం. ప్రభుత్వం జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి. – డి.బంగార్రాజు, హమాలీస్
యూనియన్ ప్రధాన కార్యదర్శి
ఉపాధికి దెబ్బ
ఎచ్చెర్లలో ఐఎంఎల్ డిపోకోసం భూములు ఇచ్చారు. వాటికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. వారికి నష్టపరిహారం అందించడం, పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేయడం, రైతులను ఆదుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన మంత్రి అచ్చెన్నాయుడు ఇలా కార్మికులు ఉపాధిని దెబ్బతీయాలని చూడటం తగదు.
– సీహెచ్ అమ్మన్నాయుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
ఎచ్చెర్ల : రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్లలోని ఐఎంఎల్(ఇండియన్ మేడ్ లిక్కర్) డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులపై అందులో పనిచేస్తున్న దళిత కుటుంబాలు మండిపడుతున్నాయి. తరతరాలుగా ఈ డిపోను నమ్ముకుని సుమారు 350 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. డిపో విభజన జరిగితే తామంతా రోడ్డున పడతామని వాపోతున్నారు. సొంత గొడౌన్లలో చక్కగా నడుస్తున్న డిపోను అదనపు ఖర్చులు చేసి ఎవరి ప్రయోజనాలకోసం విడదీయాల్సి వస్తుందో సమాధానం చెప్పాలని బాధిత కుటుంబాల వారు ప్రశ్నిస్తున్నారు.
మూడు తరాలుగా జీవనాధారం
ఎచ్చెర్ల గ్రామంలో 100 మంది దళిత కుటుంబాలకు చెందిన వారి నుంచి జాతీయ రహదారికి పక్కన కోట్లాది రూపాయలు విలువచేసే నాలుగు ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా 1986లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న భూమిలో అప్పట్లో సారాతయారీ కేంద్రం ప్రారంభించింది. ఇందులో భూములు ఇచ్చిన కుటుంబాలకు చెందిన 40 మందికి ఉపాధి కల్పించింది. 1992లో యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటుచేసి బ్రాందీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి వీరినే కార్మికులుగా, హమాలీలుగా కొనసాగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ కుటుంబాలకు చెందిన వారంతా డిపోను నమ్ముకుని జీవిస్తున్నారు. ఇప్పుడు విభజన చేపట్టి మూడు తరాలుగా నమ్ముకున్న తమ జీవనాధారాన్ని దూరం చేయడంపై వీరంతా మండిపడుతున్నారు.
అవసరం లేకున్న అద్దెకు..
ఎచ్చెర్లలో ఐఎంఎల్ డిపో సొంత గొడౌన్లలో ఎలాంటి వివాదాలు లేకుండా నడుస్తున్నప్పుడు టెక్కలిలో అద్దెకు తీసుకుని మరీ డిపో ఏర్పాటుచేయాలనుకోవడంపై వీరంతా విస్మయం చెందుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడి వర్గీయుల ప్రయోజనాల కోసం లక్షలాది రూపాయులు అదనపు ఖర్చు చేసి అద్దె భవనంలో డిపోను పెట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని కార్మికులు విమర్శిస్తున్నారు. ఎచ్చెర్లలో సరిపడా గొడౌన్, అధికార కార్యాలయ విభాగం, స్థలం, కార్మికులు ఉన్నారని, ఇక్కడ నుంచి అన్ని షాపులకు సకాలంలో సరుకులు అందుతునే ఉన్నాయని, అయినప్పటికీ విభజన పేరుతో టెక్కలిలో లక్షలాది రూపాయులు అద్దెలు చెల్లించి డిపో పెట్టాలనుకోవడం వెనుక అర్ధమేంటని వారంతా ప్రశ్నిస్తున్నారు.
అవసరం లేకపోయినా..
ఎక్కడైనా ఓ డిపోపై పనిభారం పెరుగుతుంటే మరో డిపో ఏర్పాటుకు చర్యలు తీసకుంటారు. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా భవిష్యత్తులో పనిభారం తగ్గనున్న డిపోను విడదీస్తున్నారని కార్మికులు అంటున్నారు. ప్రస్తుతం ఈ డిపో ద్వారా జిల్లాలో 231 వైన్షాప్లు, బార్లకు సరుకు సరఫరా అవుతుంది. పార్వతీపురం మన్యం, రాజాం ప్రాంతాలకు చెందిన 48 షాపులకు ఈ డిపో ద్వారా భవిష్యత్తులో సరుకులు సరఫరా చేయాల్సిన పనిలేదు. ఇప్పటికే వీరంతా మద్యం మాత్రమే ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు. మిగతా తతంగమంతా ఆయా ప్రాంతాల్లోనే జరుపుకుంటున్నారు. అలాంటప్పుడు రెండో డిపో అవసరం లేదని కార్మికులు, పలు సంఘాల నాయకులు అంటున్నారు.
మంత్రి వర్గీయుల కోసమేనా?
వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి వర్గీయుల స్వలాభం కోసం డిపో విభజన చేపడుతున్నారని ఇక్కడ సర్వత్రా చర్చించుకుంటున్నారు. టెక్కలి ప్రాంతంలో తన వర్గీయులకు వైన్షాపులు ఎక్కువగా ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గి లాభాలు వస్తాయని, తన వర్గానికి చెందిన వారికి అద్దె గొడౌన్లో పెడితే లక్షలాది రూపాయులు లాభాలు వస్తాయని, స్థానికులకు ఉపాధి కల్పించి సానుభూతి పొందవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ డిపో విభజన చేపడుతున్నారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉపాధి పొందుతున్న దళితులకు జీవనాధారం పోతుందని ఎచ్చెర్ల దళిత కుటుంబాలు, కార్మికులు వాపోతున్నారు.
పదిపైసల నుంచి పని..
మూడు తరాలుగా పదిపైసలు కూలీ నుంచి పనిచేస్తున్నామని దళితులు చెబుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న హమాలీలకు ప్రస్తుతం రోజుకు రూ.800 వరకూ కూలీ వస్తోంది. లారీ నుంచి మద్యం పెట్టెలను దించి గోడాంలో పేర్చి తిరిగి గేటు బయట మద్యం షాపులకు లోడ్ చేయడానికి పెట్టెకు రూ.8 ఇస్తారు. ఇలా ఒకరోజు పనిఉంటే ఎక్కువ డబ్బులు మరో పనిలేకపోతే తక్కవ డబ్బులు వస్తాయి. వీటిని హమాలీలంతా కూలీగా పంచుకుంటారు. వీటితోనే జీవనం గడుపుతున్నారు. ఇప్పుడు డిపో విడిపోతే పెట్టెల సంఖ్య తగ్గిపోయి సగానికిపైగా కూలీ తగ్గిపోతుందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో
విభజనపై మండిపడుతున్న దళితులు
సొంత గొడౌన్లు కాదని టెక్కలిలో అద్దెకు తీసుకోవడంపై విస్మయం
మూడు తరాల జీవనాధారాన్ని దూరంచేసే పనులపై ఆగ్రహం
మంత్రి అచ్చెన్నాయుడి
వర్గీయులకోసమేనని మండిపాటు
పాలకుల తీరుపై మండిపాటు..
తమ జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్న పాలకుల తీరుపై దళితులు మండిపడుతున్నారు. తమ జీవనాధారాన్ని దూరం చేసే జీవోలను వెంటనే వెనక్కి తీసుకుని తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎచ్చెర్లలో సొంత గొడౌన్లలో మద్యం సరఫరా చేస్తుంటే అదనంగా టెక్కలిలో మరో డిఫో అద్దెకు తీసుకుని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ‘ఏపీఎస్బీసీఎల్/1/ఎంఎంవై/2025–26/356’ను జారీ చేయడంపై వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పొట్టకొట్టొద్దు..!

పొట్టకొట్టొద్దు..!

పొట్టకొట్టొద్దు..!

పొట్టకొట్టొద్దు..!

పొట్టకొట్టొద్దు..!