
సాంకేతిక సేద్యంతో
మాట్లాడుతున్న డీఆర్ఓ మురళీకృష్ణ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శాస్త్ర సాంకేతిక పద్ధతులు వినియోగిస్తూ వ్యవసాయం చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కళా వేదికలో డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో భాగంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. తొలుత సీఎం జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానం ద్వారా గుంటూరు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు సబ్సిడీ జమచేశారు. అనంతరం స్పీకర్, మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి కుటుంబం రైతుల అభ్యున్నతిపై దృష్టి సారించిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయిలో రైతులకు అండగా నిలుస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు యాంత్రీకరణ సేవలు వినియోగించుకొని దిగుబడులు పెంచే దిశగా అడుగులు వేయాలన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు ద్వారా జరుగుతుందన్నారు. ట్రాక్టర్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందన్నారు.
● ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ రైతుల వలసలు తగ్గించి వారి ఆదాయం పెంచాలనేదే యంత్రసేవా పథకం ముఖ్య ఉదేశమన్నారు. ట్రాక్టర్లు, ఆధునిక యంత్ర పరికరాలు రైతు సంఘాలకు అందజేయడం శుభపరిణామమన్నారు. రెండో విడతలో రూ.37.38 కోట్ల విలువైన 269 ట్రాక్టర్లు, 37 ఇంప్లిమెంట్స్, 22 హార్వెస్టర్లను కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల కింద పనిచేయనున్న 308 రైతు సంఘాలకు పంపిణీ చేసినట్లు వివరించారు. యూనిట్లు పొందుతున్న సంఘాలకు రూ.12.94 వరకు సబ్సిడీ అందజేసినట్లు తెలిపారు. ఇచ్ఛాపురంలో 34, పలాసలో 41, టెక్కలిలో 44, నరసన్నపేటలో 57, శ్రీకాకుళంలో 17, ఎచెర్లలో 45, ఆమదాలవలసలో 35, పాతపట్నంలో 58 రైతు సంఘాలకు యంత్ర సేవా పరికరాలు అందజేసినట్లు వివరించారు. యంత్రాలను అద్దె ప్రాతిపదికన సన్న, చిన్న కారు రైతులు వినియోగించుకోవచ్చన్నారు.
● డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 328 సీహెచ్సీ గ్రూపుల్లోని రైతులకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతు సంఘాలకు నమూనా చెక్కు అందజేశారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో జెండా ఊపి రైతులు, రైతు సంఘాలకు, ట్రాక్టర్లు, ఆధునిక యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నేతాజీ, గొండు రఘురామ్, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మ న్ అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, రొక్కం సూర్యప్రకాష్, ఎంపీపీలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రైతు ఖాతాల్లోకి సబ్సిడీ నగదు జమ
వైఎస్సార్ యంత్ర సేవా పథకం
ప్రారంభోత్సవంలో స్పీకర్ తమ్మినేని,
మంత్రి ధర్మాన
జిల్లాలో 328 సీహెచ్సీ గ్రూప్లకు రూ.12.95 కోట్ల రాయితీ
