
ఎందుకీ తెలుగు ద్వేషం?
తీవ్ర అన్యాయం..
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమానికి పాతరేసేలా కూటమి ప్రభుత్వం దుందుడుకు చర్యలు చేపడుతోంది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమం లేదంటూ పేర్కొనడం విచారకరం. కూటమి ప్రభుత్వం ఆనాడు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం తగదు. – పిపిసి వసంతరావు,
రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు
తెలుగుకు వెలుగేదీ?
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూటమి పార్టీల పెద్దలు, నాయకులు.. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీషుమీడియం, సీబీఎస్సీ సిలబస్ పట్ల.. అనరాని మాటలు అన్నారు. ఆ వాఖ్యలు, ప్రకటనలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చాక తెలుగు మాధ్యమాన్ని అధఃపాతాలానికి తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి.
– కూన రంగనాయకులు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి తూట్లు పొడుస్తోందని గత ఐదేళ్లగా అక్కసు వెళ్లగక్కిన కూటమి నాయకులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమానికి మంగళం పాడేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేదంటూ విద్యాశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కలిపి 2,638 ఉండగా.. అందులో 1,61,151 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఇంటర్లోనూ తెలుగును ఐచ్ఛికం చేస్తూ..
ఇంటర్మీడియెట్లో సైతం ఇన్నాల్లు తప్పనిసరిగా ఉన్న తెలుగు సబ్జెక్టును.. ఐచ్ఛికం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి తెలుగు అధ్యాపకులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తెలుగు మాధ్యమానికి అన్యాయం చేస్తున్నారని.. తెలుగులోనే బోధన, చదువులు కొనసాగాలని గగ్గోలు పెట్టిన కూటమి పార్టీల పెద్దలు, నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ స్వరం మార్చుకుంటున్నారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ తెలుగుమాధ్యమం లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల తెలుగుభాషాభిమానులు, ఏపీ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ ప్రతినిధులు మండిపడుతున్నారు.
నాడు తెలుగుకు అన్యాయం జరగకుండా..
తెలుగు సబ్జెక్టుకు అన్యాయం జరగకుండా.. తెలుగును సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను తీసుకొచ్చింది. పేద, మధ్య తరగతి పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీపడి రాణించాలని ఆనాడు ఇంగ్లీషుమీడియంలో చదువు, సీబీఎస్సీ సిలబస్ అమలు విషయంలో ఎవరెన్ని చెప్పినా ఆనాటి గత సర్కారు వెనక్కి తగ్గలేదు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి కోర్సులను కూడా తెలుగు మాధ్యమంలో బోధించాలని పేర్కొంటే.. రాష్ట్రంలో మాత్రం పాఠశాలల్లో ఆ నిబంధనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలు తమ మాతృభాషకు అగ్రతాంబూలమిస్తుంటే మన రాాష్ట్రంలో మాత్రం మాతృభాషను పట్టించుకునే వారే లేకపోవడం బాధాకరమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా శాఖ అధ్యక్షులు పిసిని వసంతరావు, ప్రధాన కార్యదర్శి కూన రంగనాయకులు, ముఖ్య ప్రతినిధులు పూడి లక్ష్మిపతి, పట్నాన వెంకటరమణ, కుప్పన్నగారి శ్రీనివాసరావు, గోడబ మేరీప్రసాద్, సీహెచ్ జనార్ధన్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునర్వ్యవస్థీకరణలో తీవ్ర అన్యాయం..
పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను తీసేయడం తీవ్ర అన్యాయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు మండిపడుతున్నారు. 8వ తరగతి తర్వాత రాబోయే పదో తరగతిలో తెలుగు ఉత్తీర్ణత ప్రభావితం కానుందని గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీ నాయకులు మాటలు, ప్రకటనలు విని నిలువునా మోసపోయామని తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..
తెలుగుభాష పట్ల గౌరవం ఉంటే తక్షణం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలి.
విద్యార్థుల రేషియో ఆధారంగా బడుల్లో తెలుగు ఉపాధ్యాయులను నియమించాలి.
తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు పొందేందుకు 2% రిజర్వేషన్ కల్పించాలి.
డిగ్రీ వరకు తెలుగును ఐచ్ఛికం కాకుండా.. తప్పనిసరి సబ్జెక్టుగా తీసుకురావాలి.
ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి.

ఎందుకీ తెలుగు ద్వేషం?

ఎందుకీ తెలుగు ద్వేషం?