
సాక్షిప్రతినిధి, శ్రీకాకుళం: ఒడిశాలో రైలు ప్రమాదం జరగడంతో సిక్కోలు ఉలిక్కి పడింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టి పట్టాలు తప్పడంతో పెను విషాదం చోటుచేసుకుంది. కోరమాండల్ బోగీలను యశ్వంత్పూర్– హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఒడిశాలో బాలాసోర్కి 40 కిలోమీటర్ల సమీపంలో బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారుల నుంచి సమాచారం. ఈ ప్రమాదంలో 350 మంది గాయాలపాలవ్వగా 50 మందికి పైగా మృతిచెందినట్లు తెలిసింది. కోరమండల్ ఎక్స్ప్రెస్కు బరంపురం, విశాఖపట్నంలో హాల్ట్లు ఉన్నాయి. పలు స్టేషన్లలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రయాణికులు ఎక్కే అవకాశం ఉంది. అలాగే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్కు శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస), పలాస, బరంపురంలో హాల్ట్ ఉంది. రైళ్లు ఢీకొన్న సంఘటనలు తెలుసుకున్న సిక్కోలు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వేసవి సెలవులు కావడం, ప్రతి గ్రామంలో అమ్మవారి పండుగలు అధికంగా జరుగుతుండడంతో సుదూర ప్రాంతాల నుంచి పండగలకు, బంధువుల ఇళ్లకు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే చైన్నెకు నిర్మాణ పనుల కోసం వెళ్తుంటారు. ప్రమాదాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత జిల్లా కలెక్టర్లను అలెర్ట్ చేసింది. టోల్ ఫ్రీ నంబర్లు సిద్ధం చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని ప్రయాణికులకు కావాల్సిన సహకారం అందిస్తున్నట్లు సమాచారం. అటు రైల్వే అధికారులు, ఇటు జిల్లా అధికారులు ప్రయాణికులకు తగిన సాయం అందిస్తున్నారు.
● శ్రీకాకుళం పరిధిలో సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 08942–286213, 08942–286245లకు నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
● పలాస పరిధిలో వారు 9866029078లకు
సంప్రదించవచ్చు.
● సిక్కోలు జిల్లాకు సంబంధించి తక్కువమందే ప్రయాణికులు ఉంటే అవకాశాలు ఉండొచ్చని సమాచారం. అయినప్పటికీ ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి తమ బంధువులు, స్నేహితుల వివరాలు తెలుసుకుంటే మంచిదని అధికారులు భావిస్తున్నారు.
ఒడిశాలోని బహనాగా రైల్వేస్టేషన్లో పట్టాలపై తిరగబడిన బోగీల వద్ద సహాయక చర్యలు
రైళ్ల రద్దు.. దారి మళ్లింపు
ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లాల్సిన రైళ్లను కొన్నింటిని రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ ఉన్నత అధికారులు ప్రకటించారు. పలాస రైల్వే స్టేషన్లో అత్యవసర హెల్ప్లైన్ నంబర్ 986602978ను ఏర్పాటు చేశారు.
ఒడిశాలో రైలు ప్రమాదం
భారీగా ప్రాణనష్టం
జిల్లా ప్రయాణికులు ఉండొచ్చేమోనన్న అనుమానం
హెల్ప్లైన్ నంబర్లతో అప్రమత్తం చేస్తున్న అధికారులు

సహాయక చర్యల్లో రైల్వే సిబ్బంది

పలాస రైల్వేస్టేషన్లో హెల్ప్డెస్క్
