
ఆస్పత్రికి సిబ్బందికి వస్తువులు అందిస్తున్న 108 సిబ్బంది
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అన్నదాన విభాగంలో వినియోగించేందుకు వీలుగా రూ.25 వేల విలువైన ఫైర్ అండ్ సేఫ్టీ పరికరాలను బి.అనంతరావు అనే భక్తుడు వితరణగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, సీనియర్ అసిస్టెంట్ జి.ఎ.వి.ఎల్.ఎన్ కృష్ణమాచార్యులు, నేతేటి హరిప్రసాద్ శర్మ పాల్గొన్నారు.
108 వాహన సిబ్బంది ఔదార్యం
కంచిలి: కంచిలి మండల 108 అంబులెన్స్ సిబ్బంది విధి నిర్వహణలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడటంతో పాటు అతని విలువైన వస్తువులను నిజాయితీగా ఆస్పత్రి సిబ్బందికి అందించారు. పలాస మండలం మొగిలికొత్తూరుకు చెందిన కొమ్మరి లోకేష్ అనే తాపీమేసీ్త్ర పలాస నుంచి ఇచ్ఛాపురం మండలం సీమూరు గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జక్కర గ్రామ కూడలి వద్ద గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ‘సిమొకోసియస్ స్టేజ్’ అనే వ్యాధి కారణంగా అపస్మార స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది తిరుపతిరావు, ఎన్.రామారావు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి సపర్యలు చేసి సోంపేట సామాజికి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితునికి చెందిన రూ.10,330 నగదు, మొబైల్ఫోన్, బైక్ తాళాలను ఆస్పత్రి సిబ్బందికి అందజేశారు.
ఆర్అండ్బీ ఎస్ఈగా జాన్ సుధాకర్
శ్రీకాకుళం: ఆర్అండ్బీ ఎస్ఈగా కె.జాన్ సుధాకర్ శుక్రవారం విధుల్లో చేరారు. ప్రభు త్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం ఆర్అండ్బీ ఎస్గా పనిచేసిన కె.కాంతిమతి విశాఖపట్నానికి బదిలీపై వెళ్లారు. విశాఖలో పనిచేస్తున్న కె.జాన్ సుధాకర్ బదిలీపై శ్రీకాకుళం వచ్చారు. జాన్ సుధాకర్ను ఈఈ పి.సత్యనారాయణ, ఎస్.రవినాయక్ సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేశారు.
14న జిల్లాస్థాయి పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పాఠశాల, కళాశాలల్లో జేఆర్సీ, వైఆర్సీ విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్వచ్చంద రక్తదానం– ఆవశ్యకత’ అనే అంశంపై ఈ నెల 10లోగా ఆయా స్కూళ్లు, కళాశాలలో పోటీలు నిర్వహించి ఎంట్రీలను జిల్లా స్థాయి కమిటీకి పంపించాలని కోరారు. వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎంపిక చేస్తామని తెలిపారు. 14న బాపూజీ కళామందిర్లో సర్టిఫికెట్లు ఆందజేస్తామని చెప్పారు. అదే విధంగా, 50 పర్యాయాలకు మించి రక్తదానం చేసిన వారికి సత్కారం చేస్తామని పేర్కొన్నారు.

ఫైర్ సేఫ్టీ పరికరాలతో దాత, ఈవో, ప్రధానార్చకులు

జాన్ సుధాకర్ను మర్యాదపూరకంగా కలిసిన ఈఈ సత్యనారాయణ