వజ్రకరూరు: అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాకు చెందిన విజయకుమార్ నాయక్ (39)కు భార్య అన్నపూర్ణ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశగనతో పాటు కంది పంట సాగు చేసేవాడు. బోరుబావుల తవ్వకం, పంటల పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం గ్రామ శివారున ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకుని విషపు గుళికలు మింగాడు. అపస్మారకంగా పడి ఉండడంతో అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయకుమార్ నాయక్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి ఆత్మహత్య
హిందూపురం: స్థానిక రైల్వే స్టేషన్కు సమీపంలోని ఎంజీఎం మైదానం వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కీ మెన్ శ్రీనునాయక్ సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జేబులో లభ్యమైన ఉత్తరం ఆధారంగా మృతుడిని వాల్మీకి సర్కిల్ వద్ద నివాసముంటున్న రఘుశంకర్ (67)గా గుర్తించారు. పురోహితుడిగా పనిచేస్తూ తన అక్క ఇంట్లో నివాసముండేవాడు. వివాహం కాలేదు. దీంతో ఒంటరి జీవిఇతాన్ని తాళలేకపోతున్నట్లుగా ఉత్తరం రాసి గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


