పావగడ: పార్టీలు, ప్రాంతీయ బేధాలు లేకుండా అందరూ కలసికట్టుగా కృష్ణా జలాల సాధనకు ఉద్యమిద్ధామని రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పావగడకు వచ్చిన ఆయన స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న తాను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో హంద్రీ–నీవా పథకం కింద రొద్దం పెద్దకోడిపల్లి చెరువు నింపి అక్కడి నుంచి నాగలమడక ఉత్తర పినాకిని నది ద్వారా పేరూరు అప్పర్ పెన్నార్ డ్యాం కు కృష్ణా జలాలు తరలించినట్లు గుర్తు చేశారు. దీంతో నాగలమడక నదీ పరివాహక గ్రామాల బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. అయితే గత మూడేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచి పోయిందని, అలాగే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాం కు నీటి సరఫరా చేయడానికి సంబంధించిన కాలువ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ లెక్కన పేరూరు డ్యాంకు నీరు చేరాలంటే దాదాపు 20 ఏళ్లు పడుతుందన్నారు. నాగలమడక ఉత్తర పినాకిని నది ద్వారా పేరూరు డ్యాం కు సులభరీతిలో నీటిని తరలించే అంశంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టి సారించాలన్నారు. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప సైతం కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామితో మాట్లాడి నీటి తరలింపుల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప పలువురు జేడీఎస్ నేతలు పాల్గొన్నారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి


