ప్రశాంతి నిలయం: సీతారాముల కళ్యాణం ఒక పురాణ ఘట్టం కాదు.. ఒక సంపూర్ణ జీవన పాఠం. నేటి తరం యువతకు బంధాల పట్ల ఉండాల్సిన నిబద్ధతను, అచంచలమైన విశ్వాసాన్ని గుర్తు చేస్తోంది. కష్టాల్లో కుంగిపోకుండా.. సుఖాల్లో పొంగిపోకుండా క్రమశిక్షణ, ఓర్పు, సహనంతో ముందుకు సాగాలని నేర్పుతోంది. కుటుంబ విలువల పట్ల ఉండాల్సిన గౌరవాన్ని తెలియజేస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా భాగస్వామి పట్ల పరస్పర గౌరవం, నమ్మకం ఉండాలని సూచిస్తోంది. ఇవన్నీ ఉంటేనే సంసార జీవితం బాగుంటుందని.. సంసార జీవితం బాగుంటేనే సమాజంలో గౌరవం దక్కుతుందని తెలియజేస్తోంది. ఇంతటి విశిష్టమైన సీతారాముల కల్యాణోత్సవం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని సాయి కుల్వంత్ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో దేశవిదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెలంగాణ భక్తులు స్వయంగా వడ్లను గోటితో వలచి తలంబ్రాలను చేసి తీసుకువచ్చారు. తెలంగాణ, కర్ణాటక భక్తులు సుమారు 300 రకాల నైవేద్యాలను సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది.
వేంకటేశ్వరాలయం.. చరిత్రకు చిహ్నం
గడ్డి వాముల దగ్ధం
విడపనకల్లు: ఆరు గాలం శ్రమంచి పశువుల కోసం పోగు చేసుకున్న గ్రాసం అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన ఎస్సీలు, బీసీలు, దూదేకుల కులాలకు చెందిన చిన్న, సన్న కారు రైతులందరూ కలసి గాజుల మల్లాపురానికి వెళ్లే మార్గంలో గడ్డి వాములు వేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగాయి. ఏక మొత్తంగా గడ్డివాములన్నింటినీ మంటలు చుట్టుముట్టడంతో రైతులు హాహాకారాలు పెడుతూ అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడం గ్రామస్తులకు సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు రూ. 20 లక్షల విలువైన గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నుంచి వచ్చిన ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనతో వన్నూరుసాహెబ్, వన్నూరువలి, ఓబులేసు, రహమత్ హుస్సేన్, చౌడిక హనుమంతు, చౌడిక యల్లప్ప, చౌడిక రామయ్య, బొమ్మయ్య గారి చిన్న మారెయ్య, మహేష్, రాముడు, పెన్నయ్య, సూరి, పంపా, వన్నారెడ్డి, హనుమంతు, ఓబులేసు, రంజాన్, యల్లప్ప మరికొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిలో వన్నూరు సాహెబ్కు చెందిన ఓ ఎద్దును సైతం మంటలు చుట్టుముట్టడంతో 60 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. అలాగే మాళాపురం గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రైతు నాగన్న గౌడుకు చెందిన నర్సరీ కాలిపోయింది.
కనగానపల్లి: మండల పరిధిలోని తిరుమలదేవర గుట్టపై వెలసిన వేంకటేశ్వరస్వామి ఆలయం చరిత్రకు చిహ్నంగా నిలిచింది. గ్రామానికి సమీపంలో సుమారు ఐదు శతాబ్దాల క్రితం వేంకటేశ్వరాలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. గుట్టపై శ్రీకృష్ణదేవరాయుల వంశీకులు 1550లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే కాలక్రమంలో ఈ ఆలయం కొంత దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. భక్తుల సహకారంతో ఈ ఆలయంలో రోజూ ధూపదీప నైపధ్యాలు జరుగుతున్నాయి.
16వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆలయ వద్ద శాసనాలు:
తిరుమలదేవర గుట్టపై వెలసిన వేంకటేశ్వరాలయాన్ని 16 శతాబ్దంలోని నిర్మించినట్లు ఆలయం ముందు శాసనాలు కూడా లిఖించారు. అప్పటి ద్రవిడ లిపిలో ఒక బండరాయిపై లిఖించిన ఈ శాసనంలో ఆలయం చరిత్రను తెలియజేస్తుందని పెద్దలు చెప్తున్నారు. గతంలో ఈ ఆలయం చుట్టూ మంటపాలు, పెద్ద సత్రాలు ఉండేవని, కాని కాలక్రమంలో అవి పాడైపోయాయని గ్రామస్తులు తెలిపారు. ఇక గర్భగుడి ముందు ఒక చిన్న చేదబావి ఉండేదని, అందులో ఊరిన నీటితోనే స్వామి వారికి అభిషేక పూజలు చేసేవారంటున్నారు. గ్రామానికి ఎగువున గుట్టపై ఆలయం ఉండటంతో వాస్తుకు, పవిత్రతకు చిహ్నంగా నిలిచిందని భక్తులు చెప్తున్నారు.
దాతలు, భక్తులు సహకారంతో అభివృద్ధి:
పురాతన కాలంలో నిర్మించిన ఆలయాన్ని తిరిగి పునరుద్ధరణ చేయటంలో దాతలు, స్వామి భక్తులు ఎంతో సహకరిస్తున్నారని గ్రామస్తులు చెపుతున్నారు. వీరి సహకారంతోనే ఆలయం చుట్టూ గుట్టపై పెరిగిన ముళ్ల చెట్లు, రాళ్లు తొలగించి ఆలయంపైకి వెళ్లటానికి మెట్లు, దారి ఏర్పాటు చేశారు. ఇక దాతల సహకారంతో ఆలయం వద్ద కొత్తగా సత్రాలు, నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇక ప్రజాప్రతినిధులు సహకారంతో గతంలో ముళ్ల కంపలతో మూసుకొనిపోయిన రహదారిని బాగుచేసి ఆలయం వరకు సిమెంట్ రోడ్డు కూడా వేశారు. దీంతో పాటు ఆలయం వద్ద సుమారు రూ.కోటి వరకు వెచ్చించి, కల్యాణ మంటపాన్ని కూడా నిర్మిండటానికి ఏర్పాట్లు చేసినట్లు గ్రామస్తుడు, భక్తుడు వీరా తెలిపారు.
16వ శతాబ్దంలో తిరుమలదేవర గుట్టపై వెలసిన దేవదేవుడు
భక్తులు, దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం


