గాండ్లపెంట: విశ్వ కవి యోగి వేమన తిరునాల ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని యోగి వేమన ఆలయంలో ఏటా ఉగాది తర్వాత వారం రోజులకు తిరునాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు తిరునాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి కుంభాభిషేకం, విశేష పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 30వ తేదీ పానక పందేరం, బండ్ల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు, 31న ఉట్ల తిరునాల, అగ్ని సేవ, ఏప్రిల్ 1న గొడుగుల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పీఠాధిపతి తుంగా చెన్నారెడ్డి తెలిపారు.
వేమన ఆలయాన్ని పరిశీలించిన డీఎస్పీ
గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని విశ్వకవి యోగి వేమన ఆలయాన్ని కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 29 నుంచి 4 రోజుల పాటు యోగి వేమన తిరునాల జరుగనున్న నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఆలయ నిర్వాహకులు తుంగా నందవేమారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ సుమతి ఉన్నారు.
అరటి, కొబ్బరి తోటల దగ్ధం
రామగిరి: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో అరటి, కొబ్బరి తోటలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... రామగిరికి చెందిన రైతులు అనిల్, నాగరాజు పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. తనకున్న రెండు ఎకరాల్లో అనిల్ అరటి పంటను సాగు చేశాడు. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి అరటి తోటతో పాటు పక్కనే ఉన్న నాగరాజు పొలంలోని 17 కొబ్బరి చెట్లు, చింత చెట్టును చుట్టుముట్టాయి. మంటలు అదుపు చేసేలోపు అనిల్కు రూ.3 లక్షలు, నాగరాజుకు రూ.50 వేల నష్టం వాటిల్లింది. ఘటనపై బాధితులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.


